జగన్ కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?
వైఎస్ జగన్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పదవులు ఎవరికి దక్కుతాయోననే ఆసక్తికర చర్చ సర్వత్రా నెలకొంది.కీలకమైన పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించనున్నట్టు జగన్ తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గత నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 8వ తేదీన తన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. అదే రోజున సచివాలయంలో జగన్ అడుగుపెట్టనున్నారు.
తన మంత్రి వర్గంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్టు జగన్ ప్రకటించారు. అయితే ఐదు కీలకమైన సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులను ఇవ్వనున్నారు.
మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పేర్లు డిప్యూటీ సీఎం పదవుల కోసం పరిశీలిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన అంజద్ భాషాకు చెందిన బెర్త్లో చోటును ఖరారైంది.
గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానం నుండి ముస్తఫా కూడ మైనార్టీ కోటాలో బెర్త్ కోసం ఆశిస్తున్నారు. అయితే మైనార్టీ కోటాలో అంజద్ భాషాకు డిప్యూటీ సీఎం పోస్ట్ దక్కనుంది.
ఎస్టీ సామాజిక వర్గం నుండి పిడికె రాజన్న దొర, పుష్పశ్రీ వాణి పేర్లు విన్పిస్తున్నాయి. మహిళా కోటాలో డిప్యూటీ సీఎం పదవికి పుష్ఫశ్రీ పేరు విన్పిస్తోంది. అయితే పుష్పశ్రీ కంటే రాజన్న దొర సీనియర్. రాజన్నదొర వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందినవారిలో ఆళ్లనాని, గ్రంధి శ్రీనివాస్ ల పేర్లు కూడ డిప్యూటీ సీఎం పదవి కోసం పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఆళ్లనాని వైపుకు జగన్ మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.
ఎస్సీ సామాజిక వర్గం నుండి మేకతోటి సుచరితకు జగన్ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మేకతోటి సుచరితతో పాటు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిమూలం సురేష్లలో ఎవరో ఒకరికి డిప్యూటీ సీఎం పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.
ఇక బీసీ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ, పార్థసారధి తదితరుల పేర్లు కూడ డిప్యూటీ సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తన మనసులోని అభిప్రాయాలను వైఎస్ఆర్సీఎల్పీ సమావేశంలో జగన్ బయటపెట్టారు. అయితే పదవులు మాత్రం ఎవరికి దక్కనున్నాయో కొన్ని గంటల్లో తేలనుంది.