టిడిపి మహానాడుకు సర్వం సిద్దం... 17 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం
మహానాడులో ప్రవేశపెట్టే 17 తీర్మానాలకు ప్రకాశం జిల్లా ఒంగోలులో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన టిడిపి పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది.

tdp Politburo Meeting
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్దమయ్యింది. ప్రకాశం జిల్లా మండువవారిపాలెంలో ఈనెల 27, 28 తేదీల్లో (ఇవాళ, రేపు) మహానాడును ఘనంగా నిర్వహించేందుకు టిడిపి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇక ఇప్పటికే మహానాడులో పాల్గొనేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్య నాయకులు ప్రకాశం జిల్లా బాటపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అధ్యక్షతన ఒంగోలులో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశమయ్యింది. మహానాడులో ప్రవేశపెట్టే 17 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడు నిర్వహణ పై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించారు.
tdp Politburo Meeting
మహానాడులో ఎపికి సంబంధించిన 12 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 3 తీర్మానాలు, అండమాన్ కు సంబంధించి ఒక తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు రాజకీయ తీర్మానం కూడా ఉంటుంది. ఈ తీర్మానాలపై దాదాపు 50 మంది మాట్లాడే అవకాశం ఉంది. ఆయా తీర్మానాలు ప్రజల్లోకి వెళ్లేలా మహానాడు చర్చలు సాగాలని మహానాడులో నేతలు అభిప్రాయ పడ్డారు.
tdp Politburo Meeting
వైసిపి తలపెట్టిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర ఒక నాటకం అని పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది. ఏ వర్గానికి ఏం చేశారని సామాజిక న్యాయం అని యాత్ర చేస్తారని నేతలు ప్రశ్నించారు. వైసిపి కి మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో నలుగురు రెడ్డి వర్గానికి చెందిన వారే ఉన్నారని నేతలు పేర్కొన్నారు. 9మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు బయట రాష్ట్రాలకు చెందినవారు కాగా....ముగ్గురు సీఎం వైఎస్. జగన్ తో పాటు కేసుల్లో ఉన్న వారేనని విమర్శించారు. లాబీయింగ్ చేసేవారికి, కేసుల్లో సహా మద్దాయిలకు జగన్ రాజ్యసభ ఇచ్చారని పొలిట్ బ్యూరో ఆరోపించింది.
tdp Politburo Meeting
తెలంగాణలో 12 కులాలను బిసిల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడం ఏరకంగా సమంజసం అన్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్లి అడ్డుపడిన ఆర్ కృష్ణయ్య తప్ప ఏపిలో రాజ్యసభ ఇవ్వడానికి బిసి నేతలే లేరా? అని ప్రశ్నించారు.
tdp Politburo Meeting
తొమ్మిదిమంది రాజ్యసభలో ఒక ఎస్సి కానీ, ఒక ఎస్టి కానీ, ఒక మైనారిటీ కానీ లేరని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ఒక్కరికి కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని పొలిట్ బ్యూరో ప్రశ్నించింది. ఏవర్గానికి న్యాయం చెయ్యని వైసిపికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత...యాత్ర చేసే హక్కు లేదని టిడిపి పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది.