ఏపీలో ప్లాన్: సుజనాకు బీజేపీ కీలక పదవి, టీడీపీకి దెబ్బేనా?
ఏఫీ రాష్ట్రంలో టీడీపీని దెబ్బకొట్టేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. టీడీపీలో కీలక నేతలను బీజేపీలో చేర్పించే బాధ్యతను మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించారని సమాచారం. రాజ్యసభలోని ప్లాన్ను కూడ ఏపీ అసెంబ్లీలో అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఏపీలో టీడీపీని కోలుకోలేని దెబ్బతీసేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు.
టీడీపీలో కీలకంగా ఉన్న నేతలను బీజేపీలో చేర్పించేందుకు సుజనా కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. బీజేపీలో చేరాలని కొందరు నేతలకు సుజనా చౌదరి ఫోన్లో సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగుతోంది.
బీజేపీలో సుజనా చౌదరికి కీలక పదవిని కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఏపీ అసెంబ్లీలో కూడ రాజ్యసభలో అవలంభించిన విధానాన్ని సరైన సమయంలో అవలంభించే అవకాశం ఉంది. పార్టీ మారినా తమ పదవులు కోల్పోకుండా ఈ ప్లాన్ను అమలు చేయాలని చూస్తున్నారని ప్రచారం సాగుతోంది.
ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలకు కూడ బీజేపీ నేతలు గాలం వేస్తున్నట్టుగా చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, కర్నూల్ జిల్లాలపై సుజనా చౌదరి కేంద్రీకరించినట్టుగా ప్రచారంలో ఉంది.
2014 ఎన్నికలకు ముందు కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలపై సుజనా కేంద్రీకరించారు. ఈ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర విషయాలపై సుజనా కీలకంగా వ్యవహరించారు.
తన సంబంధాలను బీజేపీని బలోపేతం చేసేందుకు సుజనా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని కమలదళం భావిస్తోంది. ఇందులో భాగంగానే కాషాయదళం సుజనా చౌదరికి బీజేపీ నాయకత్వం కీలక పదవిని కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.