ఏపీ ఎన్నికలు: ఆ మూడు పవర్పుల్ ప్యామిలీలు ఔట్
కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసించిన మూడు కుటుంబాలు ఈ ఎన్నికల్లో మాత్రం అడ్రస్ లేకుండాపోయాయి. ఈ మూడు కుటుంబాలు కూడ ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేశాయి. వైసీపీ దెబ్బకు ఈ మూడు కుటుంబాలకు చెందిన ప్రముఖులు ఓటమిని చవి చూశారు.
కోట్ల, కేఈ, భూమా కుటుంబాలు కర్నూల్ జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్నాయి.కానీ, ఈ మూడు కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మూడు కుటుంబాలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు కూడ ఓటమి చెందారు.
కర్నూల్ జిల్లాలో కోట్ల కటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడ పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూల్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కర్నూల్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కోట్ల కుటుంబం చెరగని ముద్ర వేశారు. 1955లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టారు. రెండు సార్లు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడ పనిచేశారు. నాలుగైదు దఫాలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేంద్రమంత్రిగా కూడ పనిచేశారు. ఆరు దఫాలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కర్నూల్ నుండి ఎంపీగా విజయం సాధించారు.
కర్నూల్ నుండి తొలిసారిగా 1971లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబానికి చెందిన కోట్ల కోదండరామిరెడ్డి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు.కోట్ల కుటుంబ వారసుడిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 1997లో రాజకీయాల్లోకి వచ్చారు. కర్నూల్ ఎంపీ స్థానం నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మూడు దఫాలు ఎంపీగా గెలిచారు. కేంద్రమంత్రిగా కూడ ఆయన పనిచేశారు.
2004లో డోన్ అసెంబ్లీ స్థానం నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భార్య కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.రాష్ట్ర విభజనను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
2014 ఎన్నికల్లో కర్నూల్ స్థానం నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఆ ఎన్నికల్లో 1.15 లక్షల ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ స్థానం నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆలూరు నుండి కోట్ల సుజాతమ్మ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
కర్నూల్ జిల్లాలో కోట్ల కుటుంబంతో ఢీ అంటే ఢీ అంటూ రాజకీయాలను నడిపిన కేఈ కుటుంబం కూడ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది. కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్న జిల్లా పరిషత్ మెంబర్గా స్వాతంత్య్రానికి ముందే ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేఈ మాదన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు నిర్వహించారు.
1978లో డోన్ నుండి కేఈ కృష్ణమూర్తి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో కూడ కేఈ కృష్ణమూర్తి మరోసారి ఇదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. 1985లో కేఈ కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు.
1996 ఉప ఎన్నిక, 1999 ఎన్నికల్లో డోన్ నుండి కేఈ సోదరుడు కేఈ ప్రభాకర్ నెగ్గారు. 2004లో కేఈ ఈ స్థానంలో ఓటమి పాలయ్యారు. 2009లో ఇదే స్థానం నుండి ఆయన విజయం సాధించారు.2014 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి పత్తికొండ నుండి విజయం సాధించారు. ఇదే స్థానం నుండి ఈ దఫా తన కొడుకు శ్యాంబాబును కేఈ కృష్ణమూర్తి రంగంలోకి దింపాడు.
డోన్ నుండి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేసి కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో భూమా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గంలోని నంద్యాల, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానాల్లో భూమా కుటుంబానికి మంచి పట్టుంది. ఈ దఫా భూమా కుటుంబం నుండి పోటీ చేసిన ఇద్దరు కూడ ఓటమి పాలయ్యారు. ఆళ్లగడ్డ నుండి పోటీ చేసిన భూమా అఖిలప్రియ, నంద్యాల నుండి పోటీ చేసిన భూమా బ్రహ్మనందరెడ్డి ఓడిపోయారు. ఈ రెండు స్తానాలను వైసీపీ దక్కించుకొంది.
1985లో ఆళ్లగడ్డ నుండి భూమా వీరశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయాడు. 1992లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే స్థానం నుండి భూమా నాగిరెడ్డి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీ అడుగుపెట్టారు. 1994 ఎన్నికల్లో మరోసారి భూమా టీడీపీ అభ్యర్ధిగా నెగ్గారు.1996 ఎంపీ ఎన్నికల్లో నంద్యాల ఎంపీ స్థానంలో ప్రధాని పీవీ నరసింహారావుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ స్థానానికి పీవీ నరసింహారావు రాజీనామా చేయడంతో 1996లో జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.
1998, 1999 ఎన్నికల్లో కూడ నంద్యాల నుండి ఎంపీగా భూమా నాగిరెడ్డి గెలుపొందారు. 1997లో ఆళ్లగడ్డ నుండి భూమా శోభా నాగిరెడ్డి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.1999 ఎన్నికల్లో కూడ మరోసారి ఆమె ఇదే స్థానం నుండి నెగ్గారు. 2009 ఎన్నికలకు ముందు భూమా దంపతులు పీఆర్పీలో చేరారు.2004లో నంద్యాల నుండి భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ నుండి భూమా శోభా నాగిరెడ్డిలు టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓటమి చెందారు.
2009 ఎన్నికలకు ముందు భూమా నాగిరెడ్డి దంపతులు పీఆర్పీలో చేరారు. 2009లో ఆళ్లగడ్డ నుండి పీఆర్పీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి గెలుపొందారు. నంద్యాల నుండి ఎంపీ గా పోటీ చేసిన భూమా నాగిరెడ్డి ఓటమి పాలయ్యారు. పీఆర్పీ కాంగ్రెస్లో వీలీనం కావడంతో వీరిద్దరూ కూడ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుండి వీరిద్దరూ వైసీపీలో చేరారు.
2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి భూమా శోభా నాగిరెడ్డి, నంద్యాల నుండి భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్ధులుగా గెలిచారు. ఈ ఎన్నికలు జరగడానికి ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయినా కూడ ఆమె నెగ్గారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుండి గెలుపొందారు. తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు.
భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి 2017 లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మనందరెడ్డి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఈ దఫా నంద్యాల నుండి భూమా బ్రహ్మనందరెడ్డి, ఆళ్లగడ్డ నుండి భూమా అఖిలప్రియ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.జిల్లా రాజకీయాలను శాసించిన ఈ మూడు కుటుంబాల నుండి ఆరుగురు అభ్యర్ధులు ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.