రామ్ మాధవ్ వ్యాఖ్యలు: లెక్కలో లేని చంద్రబాబు, జగన్ పై ఢీ
రాజధాని ఎంపికలో తమ జోక్యం ఉండదని, తమకు సంబంధం లేదని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.
కుడి ఎడమల పోరును ఉధృతం చేయాలని బిజెపి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో ఆ విషయం స్పష్టంగా తేలిపోయింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యలతో పాటు సోము వీర్రాజు విమర్శలను బట్టి చూస్తే రెండో స్థానంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నట్లు రామ్ మాధవ్ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని బిజెపి లెక్కలోకి తీసుకోకూడదని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. టీడీపీ అనేది లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రామ్ మాధవ్ వ్యాఖ్యలు చంద్రబాబుపై మైండ్ గేమ్ గా కూడా భావించవచ్చు. అదే సమయంలో చంద్రబాబుతో భవిష్యత్తులో ఏ విధమైన సంబంధాలు ఉండవని కూడా ఆయన తేల్చేసినట్లయింది. నిజానికి చంద్రబాబు గత కొంతకాలంగా బిజెపికి దగ్గర కావాలని చూస్తున్నారు. ప్రధాని మోడీపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన కదలికలు ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ప్రస్తుత పరిణామం నేపథ్యంలో చంద్రబాబును బిజెపి దగ్గరకు తీసుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు అవినీతి ఆరోపణలు చేశారు. ఇళ్ల స్థలాల్లో అవినీతి చోటు చేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో మూడు రాజధానులపై రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ పై ఎక్కు పెట్టిన అస్త్రాలే. ఉత్తర ప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రానికి ఒక్క రాజధాని మాత్రమే ఉందని, ఏపీకి మూడు రాజధానులు అవసరమా అని ఆయన అన్నారు.
రాజధాని ఎంపికలో తమ జోక్యం ఉండదని, తమకు సంబంధం లేదని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. అయితే, బిజెపి మాత్రం జగన్ మీద పోరాటానికి దాన్ని ఓ అస్త్రంగానే ప్రయోగించదలుచుకున్నట్లు అర్థమవుతోంది. రాజకీయంగా జగన్ మీద పోరాటం చేసే శక్తియుక్తులు తమకే ఉన్నాయని చెప్పడం ద్వారా చంద్రబాబును వెనక్కి నెట్టేసే వ్యూహం బిజెపి అనుసరిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.