ఎన్నికలతోనే అయిపోలేదు: జగన్ తో మరో రెండేళ్లు ప్రశాంత్ కిశోర్
అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడం ఎన్నికలతోనే అయిపోలేదు. ప్రశాంత్ కిశోర్ ఐ క్యాప్ తో కాంట్రాక్టును వైఎస్ జగన్ మరో రెండేళ్లు పొడిగించారు. దాంతో వైఎస్ జగన్ తో ప్రశాంత్ కిశోర్ ఇంకా పనిచేస్తూనే ఉన్నారు
అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడం ఎన్నికలతోనే అయిపోలేదు. ప్రశాంత్ కిశోర్ ఐ క్యాప్ తో కాంట్రాక్టును వైఎస్ జగన్ మరో రెండేళ్లు పొడిగించారు. దాంతో వైఎస్ జగన్ తో ప్రశాంత్ కిశోర్ ఇంకా పనిచేస్తూనే ఉన్నారు.
ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించడానికి ప్రశాంత్ కిశోర్ పనిచేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోకసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. జగన్ కేవలం ఓ ఐదేళ్ల పాటు మాత్రమే అధికారంలో ఉండాలని అనుకోవడం లేదు. దశాబ్దాల పాటు అధికారం తన చేతుల్లో ఉండాలని ఆయన అనుకుంటున్నారు.
తన ఆలోచన కార్యరూపం దాల్చడానికి జగన్ ప్రశాంత్ కిశోర్ సాయం పాలనలోనూ తీసుకుంటున్నారు. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో ఐ క్యాప్ ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజల అవసరాలను, వారి కోరికలను కనిపెట్టడానికి సర్వేలు కూడా చేసి అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలను రూపొందించి అమలు చేయడంలో ప్రశాంత్ కిశోర్ జట్టు పనిచేస్తోంది.
ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో)లో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు ప్రధానంగా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అవినీతిని అరికట్టడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ వ్యవస్థ రూపకల్పన చేసి అది కార్యరూపం ధరించే విధంగా చూసే బాధ్యతను ప్రశాంత్ కిశోర్ టీమ్ స్వీకరించినట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెసు కోసం పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు పార్టీకి ఆయన జట్టు వ్యూహరచన చేసి అమలు చేస్తోంది. తమిళనాడులో అన్నాడియంకె, మహారాష్ట్రలో శివసేనలకు కూడా ఆయన జట్టు పనిచేస్తున్నట్లు సమాచారం.