ఏలూరే కాదు దెందులూరుకు పాకిన వింతరోగం: అధికారులకు సీఎం హెచ్చరిక
ఏలూరులో వింత రోగం కారణంగా అస్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్య సహాయం సహా ఇప్పటివరకూ తీసుకున్న చర్యల గురించి వైద్యారోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలు హటాత్తుగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు కేవలం ఏలూరులోనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆందోళనకు కారణమయ్యింది. ఇలా వందల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైఎస్ జగన్ స్వయంగా పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, వైద్యారోగ్య శాఖ అధికారులు వున్నారు.
నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ బాధితులను కలుసుకున్న ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్న సీఎం
తర్వాత జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు ఆళ్లనాని, శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, పేర్నినాని తదితరులు హాజరయ్యారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనికుమార్ సింఘాల్, వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సహా పలువురు అధికారులు హాజరు.
అస్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్య సహాయం సహా ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం. అలాగే అస్వస్థతకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. ఇప్పటివరకూ చేసిన పరీక్షల వివరాల గురించి కూడా అడిగితెలుసుకున్నారు సీఎం.
తాగునీటిపై పరీక్షలు చేయించామని, రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు.హెవీమెటల్స్పైనకూడా పరీక్షలు చేశామని అవికూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు. వివిధ రోగాలకు కారణ మవుతున్న వైరస్లపై అన్ని పరీక్షలు చేశామని, అవన్నీకూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు అధికారులు.
బ్లడ్ కల్చర్ రిపోర్టు రావడానికి కొంత సమయం పడుతుందని, వాటి ఫలితాలకోసం వేచి చూస్తున్నామని సీఎంకు తెలిపారు.సీటీ స్కాన్ రిపోర్టులు కూడా సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. అస్వస్థతకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.
ఏలూరు అర్బన్ ప్రాంతంలోనే కాకుండా ఏలూరు రూరల్, దెందులూరు పరిధిలో కూడా కేసులు గుర్తించామని సీఎంకు వివరించారు అధికారులు. పలానా వయస్సు ఉన్నవారికి మాత్రమే అస్వస్థత రావడంలేదని... అన్ని వయస్సులు వారూ ఉన్నారన్నారు. నీళ్లు వేడిచేసుకుని తాగేవారికీ అస్వస్థతకు గురవుతున్నారని, అలాగే మినరల్వాటర్ తాగేవారికీ వస్తుందన్నారు.
ఎయిమ్స్ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని, ఇవాళ ఐఐసీటీ, ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ నుంచి కూడా బృందాలు వస్తున్నాయని తెలిపారు. డిశ్చార్జిచేసిన వారిలో తిరిగి ఆస్పత్రికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అని సీఎం అడగగా ముగ్గురు తిరిగి వచ్చారన్న అధికారులు తెలిపారు. డిశ్చార్జి చేసిన వారినికూడా అబ్జర్వేషన్లో ఉంచాలని సీఎం సూచించారు. డిశ్చార్జి అయిన వారికి సరైన ఆహారం, మంచి మందులు అందించాలన్నారు.
ఎయిమ్స్ సహా ఐఐసీటీ, ఎన్ఐఎన్ బృందాలు వచ్చాక వారి పరిశీలనలనూ పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఉండాలన్న సీఎం
హెచ్చరించారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఏలూరులో ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రజలు 104, 108 నంబర్లకు కాల్చేసేలా అవగాహన కల్పించాలని... కాల్ వచ్చిన వెంటనే వారికి వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.