జగన్ కేబినెట్: మంత్రులు మారారు కానీ సీట్లు మారలేదు
అన్ని రంగాల్లో ఉన్నట్లే రాజకీయాల్లోనూ సెంటిమెంట్లు, నమ్మకాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి.సెంటిమెంట్, లక్కుల కలబోతలుగా ఉన్న నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి జగన్ కేబినెట్లో స్థానం లభించింది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో గెలిచిన పితాని సత్యనారాయణ .. నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా సేవలిందించారు. తాజా ఎన్నికల్లో పితానిపై గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథరాజును సైతం మంత్రి పదవి వరించింది.
విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం భీమిలి రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తుంది. రాజకీయాల్లో అదృష్టవంతుడిగా పేరొందిన గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచి వరుసగా రెండోసారి మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన శిష్యుడు అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి గెలిచి.. జగన్ కేబినెట్లో చోటు సంపాదించారు.
పశ్చిమ గోదావరి జిల్లా కోవ్వూరు నుంచి 2014లో గెలిచిన కేఎస్ జవహర్.. చంద్రబాబు కేబినెట్లో స్థానం సంపాదించారు. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన తానేటి వనిత.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొల్లు రవీంద్ర.. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో రవీంద్రపై పేర్నినాని విజయం సాధించారు. పార్టీలో సీనియర్ నేతగా పేరొందిన నానికి జగన్ మంత్రివర్గంలో బెర్త్ దక్కింది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి 2014 ఎన్నికల్లో రావెల కిశోర్ బాబు విజయం సాధించి.. పోటీ చేసిన తొలి ఎన్నికలోనే మంత్రిగా జాక్పాట్ కొట్టారు. అయితే ఆయనపై వివాదాలు రావడంతో చంద్రబాబు.. రావెలను తప్పించారు. తాజా ఎన్నికల్లో వైసీపీ మహిళా నేత మేకతోటి సుచరిత విజయం సాధించారు. తొలి నుంచి తనతో నడిచిన సుచరితకు జగన్ సముచిత స్థానం కల్పించారు. డిప్యూటీ సీఎం పదవితో పాట నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా సుచరితను నియమించారు.
విజయనగరం జిల్లా రాజకీయాలకు కేంద్ర స్థానమైన చీపురుపల్లిలో 2014లో టీడీపీ నుంచి గెలిచిన కిమిడి మృణాళినికి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించారు. తీవ్ర వివాదాల నేపథ్యంలో ఆమెను బాబు పదవి నుంచి తప్పించారు. తాజా ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచిన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు జగన్ కేబినెట్లో చోటు దక్కింది.