విజయనగరంలో టీడీపీ ఆఫీస్: ఆశోక్గజపతిరాజుకి కొత్త తలనొప్పులు
విజయనగరం జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది. ఆశోక్ గజపతి రాజు బంగ్లాను కాదని కొత్తగా టీడీపీ కార్యాలయాన్ని విజయనగరంలో ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.
మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజుకు పార్టీలోనే వ్యతిరేకవర్గం బహిరంగంగా సవాల్ విసిరింది. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పార్టీ కార్యాలయాన్ని బుధవారం నాడు ప్రారంభించారు.
విజయనగరం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు బంగ్లాలోనే టీడీపీ కార్యాలయం ఉంది. అయితే ఈ బంగ్లాలోని పార్టీ కార్యాలయాన్ని కాదని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇవాళ కార్యాలయాన్ని ప్రారంభించడం చర్చకు దారి తీసింది.
2019లో విజయనగరం నుండి మీసాల గీతకు టీడీపీ టిక్కెట్టు ఇవ్వలేదు.ఈ స్థానం నుండి ఆశోక్ గజపతిరాజు కూతురు పోటీ చేసి ఓటమి పాలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గీతకు టికెట్టు ఇవ్వకుండా ఆశోక్ గజపతి రాజు కూతురికి టీడీపీ సీటిచ్చినా ఆమె విజయం సాధించలేదు.
పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందకపోవడంతో కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని గీత తెలిపారు.ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ. నాయుడు, నలుగురు కార్పోరేట్ అభ్యర్ధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు.
అన్న కూతురు సంచయిత గజపతిరాజుతో ఇప్పటికే ఆశోక్ గజపతి రాజుకు తలనొప్పులు నెలకొన్నాయి. ఇదే సమయంలో పార్టీలో నేతలు కొందరు స్వంతంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
జిల్లాలో ఆశోక్ గజపతిరాజు సూచనల మేరకే చంద్రబాబు వ్యవహరిస్తారనేది పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మాజీ కేంద్ర మంత్రికి, మాజీ ఎమ్మెల్యే గీతకు మధ్య అంతరం పెరిగినట్టుగా ప్రచారం సాగుతోంది.దీంతోనే గీత కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారనే ప్రచారం కూడ తెలుగు తమ్ముల్లో నెలకొంది.
బంగ్లాలో పార్టీ కార్యాలయం కాదని కొత్తగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాజీ కేంద్ర మంత్రికి సవాల్ విసిరారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.ఈ విషయమై ఆశోక్ గజపతి రాజు ఎలా స్పందిస్తారో చూడాలి