- Home
- Andhra Pradesh
- ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ : దళిత మహిళను అవమానిస్తారా.. సుచరిత ఇంటి వద్ద అనుచరుల ఆందోళన
ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ : దళిత మహిళను అవమానిస్తారా.. సుచరిత ఇంటి వద్ద అనుచరుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు అధినేత మొండిచేయి ఇవ్వడంతో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

jagan
మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో మాజీ హోంమంత్రి, జగన్ నమ్మినబంటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తీవ్ర నిరాశకు గురయ్యారు. అత్యంత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించడం, తొలి నుంచి జగన్ వెంటే వుండటం, సామాజిక సమీకరణల నేపథ్యంలో సుచరితకు మళ్లీ ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది.
jagan
తన ఎస్సీ సామాజిక వర్గంలోని మిగతా మంత్రులందరినీ కొనసాగిస్తూ.. తనను మాత్రం పదవి నుంచి తప్పించడానికి తాను ఏం తప్పు చేశానని సుచరిత ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడానికి సుచరిత సిద్ధపడ్డట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
jagan
కేబినెట్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో రెండు రోజులుగా తమ కుటుంబసభ్యులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా పట్టించుకోవడం లేదని ఆమె సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో తమకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ సుచరిత వాపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
sucharitha
మరోవైపు సుచరితకు తాజా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆమె అభిమానులు, మద్ధతుదారులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని సుచరిత ఇంటి వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సజ్జల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దళిత మహిళను అవమాన పరిచారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సుచరిత ఇంటికి వచ్చిన ఎంపీ మోపిదేవి వెంకట రమణను వారు అడ్డుకున్నారు.