చంద్రబాబు కోటరీ ఇదే: ఎన్నికల్లో కొంప ముంచింది అదే...
పార్లమెంటు సభ్యులకు జరిగిన పదవుల పంపకంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలిగారు. తనకు తక్కువ స్థాయి పదవి ఇచ్చారనే అలకగా మాత్రమే దాన్ని భావించడానికి లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: పార్లమెంటు సభ్యులకు జరిగిన పదవుల పంపకంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలిగారు. తనకు తక్కువ స్థాయి పదవి ఇచ్చారనే అలకగా మాత్రమే దాన్ని భావించడానికి లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా చంద్రబాబు మారలేదని ఆయన అన్నారు. ఆయన చుట్టూ ఉన్నవాళ్లే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని కేశినేని నాని అన్నారు.
కేశినేని మాటలను ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. నిజానికి, చంద్రబాబు కోటరీయే ఎన్నికల్లో టీడీపి కొంప ముంచిందనే అభిప్రాయం కూడా ఉంది. ఎన్నికల సమయంలో వాస్తవాలు గ్రహించడానికి వీలు కానంతగా చంద్రబాబును ఆ కోటరీ మభ్యపెట్టిందని తెలుగుదేశం పార్టీ వర్గాలే అంటున్నాయి.
కోటరీలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్రముఖుడు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ. చంద్రబాబుకు సలహాలు ఇవ్వడంలో, పార్టీ వ్యూహరచనలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ విషయం రహస్యమేమీ కాదు. అయితే, క్షేత్రస్థాయి పరిస్థితిని సరిగా అంచనా వేయడంలో రాధాకృష్ణ విఫలమయ్యారని అంటారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగినవారిలో ఆంధ్రా ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఉన్నారు. సర్వేలు చేయడంలో దిట్టగా పేరు పొందిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో సరైన సర్వే ఫలితాలను చంద్రబాబుకు అందించారా, లేదా అనేది అనుమానమని చెబుతారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఓట్ల లెక్కింపు రోజు కూడా ఆయన చెప్పారు. బయటకు చెప్పేది ఏమైనా, చంద్రబాబుకైనా అసలు విషయం చెప్పే స్థాయిలో సర్వేలు చేయించారా, లేదా అనేది తెలియదు.
ఎన్నికల సమయంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఎబి వెంకటేశ్వర రావు కూడా చంద్రబాబును సైకిల్ దే జోరు అంటూ నమ్మించారని అంటారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ఆయనను ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇంటలిజెన్స్ సర్వేల పేర ఆయన చంద్రబాబును టీడీపిదే పక్కా విజయమని నమ్మించారని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిన ఉద్యోగ సంఘం నాయకుడు అశోక్ బాబును కూడా చంద్రబాబు ఎక్కువగా నమ్మారని అంటారు. ఉద్యోగులంతా మనవైపే ఉన్నారంటూ ఆయన చంద్రబాబును నమ్మించారని సమాచారం. ఉద్యోగులందరినీ టీడీపి అనుకూలంగా మలిచారనే ఉద్దేశంతోనే ఆశోక్ బాబుకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని అంటారు.
చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. రెండో కేంద్ర బిందువుగా ఆయన మారారు. నారా లోకేష్ ను చంద్రబాబు పూర్తి స్థాయిలో వెనకేసుకుని రావడం కూడా కొంప ముంచిందని అంటున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తానని అనడం, దానికి చంద్రబాబు అంగీకరించడం పూర్తిగా తప్పుడు నిర్ణయమని అంటున్నారు.
చంద్రబాబు కోటరీలో మరో ముఖ్యమైన ప్రముఖుడు లింగమనేని రమేష్ అంటారు. చంద్రబాబు నివాసం ఉంటోన్న ప్రాంగణం ఆయనకు చెందిందే. పవన్ కల్యాణ్ కు, చంద్రబాబుకు మధ్య మధ్యవర్తిగా ఆయనే వ్యవహరించారని అంటారు. లింగమనేని రమేష్ సలహాతోనే పవన్ కల్యాణ్ తన పార్టీని ఒంటరిగా బరిలోకి దింపారని అంటున్నారు. జనసేన ఒంటరి పోటీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కొంప ముంచుతుందని భావిస్తే, తెలుగుదేశం పార్టీకే ఎసరు పెట్టిందనే అంచనా ఉంది.