- Home
- Andhra Pradesh
- Tomato : ఏకంగా వెయ్యి క్వింటాళ్ల టమాటా కొంటున్న చంద్రబాబు సర్కార్... ఏం చేయనుందో తెలుసా?
Tomato : ఏకంగా వెయ్యి క్వింటాళ్ల టమాటా కొంటున్న చంద్రబాబు సర్కార్... ఏం చేయనుందో తెలుసా?
టమాటా ధర భారీగా పతనం అయ్యింది. ఈ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీగా టమాటా కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యింది. ఇలా కొన్న వేల క్వింటాళ్ల టమాటాలను ఏం చేయనున్నారో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Tomato Price
Tomato Price : పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మినట్లు తయారయ్యింది టమాటా రైతుల పరిస్థితి. గతంలో కేవలం ఒక్క టమాటా 10 రూపాయలు (కిలో రూ.150 నుండి రూ.200) పలికిన మర్కెట్ లోనే ఇప్పుడు కిలో రూపాయి రెండు రూపాయలు పలుకుతోంది. కేవలం ఒక్క ఎకరా టమాటా పంటవేసి లక్షలు సంపాదించినవారు ఉన్నాయి... ఇప్పుడు ఏకంగా 10, 20 ఎకరాల్లో టమాటా పండించిన రైతులు సైతం కనీసం పది ఇరవై వేలు కళ్లజూసే పరిస్థితి లేదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజుల కింద ఆకాశాన్నంటిన టమాటా ధర ఇప్పుడు అధ:పాతాళానికి పడిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో టమాటా పంటకు ప్రసిద్దిగాంచిన ప్రాంతం మదనపల్లి. అక్కడి రైతుల ప్రధాన పంట టమాటానే... ఇతర ప్రాంతాలనుండి కూడా ఈ మార్కెట్ కు టమాటా తరలిస్తారు. ఇక్కడినుండే ఏపీలోని మిగతా ప్రాంతాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక,ఒడిషా, తమిళనాడు, పాండిచ్చెరి ప్రాంతాలకు కూడా టమాటా ఎగుమతి అవుతుంది. అలాంటి మార్కెట్ లో కిలో టమాటా రూ.5 కంటే ఎక్కువ ధర పలకడం లేదు. దీంతో కనీసం రవాణాచార్జీలు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఒక్క మదనపల్లె మార్కెట్ లోనే కాదు రాష్ట్రంలోని అన్నిచోట్ల ఇలాగే ఉంది టమాటా రైతుల పరిస్థితి. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులకు సాయం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టమాటా రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది.
Tomato
టమాటా కొనుగోలు చేపట్టిన చంద్రబాబు సర్కార్ :
రాష్ట్రంలో టమాటా పండించి ధరల పతనంతో ఇబ్బందిపడుతున్న రైతుల వద్ద స్వయంగా ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. కిలో రూ.8 చొప్పున వెయ్యి క్వింటాళ్ల టమాటా కొనుగోలు చేస్తోంది ప్రభుత్వం. ఇవాళ్టి(శుక్రవారం) నుండే టమాటా కొనుగోళ్లు చేపట్టారు.
రైతుల నుండి టమాటా కొనుగోలుచేసి రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లలో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా విజయవాడ, విశాఖ, రాజమండ్రి, గుంటూరు వంటి పట్టణాల్లోని రైతుబజార్లలో మార్కెటింగ్ శాఖ ఈ టమాటాల విక్రయాలు చేపట్టనుంది.
టమాటా రైతులను ఆదుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించామని...ఇలా సేకరించిన టమాటాలను అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా సరపరా చేస్తామన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందించే రవాణా సబ్సిడిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు.
Mirchi Price
మిర్చి రైతుల పరిస్థితి ఇంతే :
టమాటా రైతుల మాదిరిగానే మిర్చి రైతుల పరిస్థితి ఉంది. మిర్చీకి కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు... దీన్నిబట్టే మిర్చీ ధర ఎంతలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే కూటమి ప్రభుత్వం మిర్చీ రైతులను కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మిర్చీ కొనుగోలు చేపట్టి రైతులకు గిట్టుబాటుధర దక్కేలా చూడాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను సీఎం చంద్రబాబు లేఖ రాసారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రమే మిర్చీ కొనుగోలు చేపట్టాలని చంద్రబాబు కోరారు.
తాజాగా ఇవాళ మిర్చి కొనుగోళ్లపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కీలక సమావేశం నిర్వహించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మిర్చికి మద్దతు ధరపై చర్చించారు... ముఖ్యంగా ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నదానిపై చర్చించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.