టార్గెట్ ఏపీ: మాజీ సీఎం కిరణ్తో పాటు పలువురికి బీజేపీ వల?
ఏపీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసింది. ఈ మేరకు పలు పార్టీలకు చెందిన వారికి వల వేస్తోంది.
ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసిన నేతలపై కమల దళం వల విసురుతోంది.బీజేపీ జాతీయ నాయకత్వం కూడ రాష్ట్ర నాయకత్వానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్ మేరకు ఇప్పటి నుండే ఆ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది.
ప్రధానంగా టీడీపీ నేతలపై బీజేపీ నాయకత్వం ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించింది. వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలపై కూడ ఆ పార్టీ కన్నేసినట్టుగా ప్రచారంలో ఉంది.
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. మరి కొందరు నేతలపైకూడ బీజేపీ వల విసురుతోందని అంటున్నారు. అయితే సమయం చూసుకొని కొందరు నేతలు టీడీపీ నుండి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మాజీ మంత్రి కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో బీజేపీ నేతలను ఇటీవల కలిశారు. కడప జిల్లా కేంద్రంలో లేదా తన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరనున్నారు.
కడప జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలను కూడ బీజేపీలో చేర్పించేందుకు ఎంపీ సీఎం రమేష్ ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. వీరశివారెడ్డి, వరదరాజులు రెడ్డిని బీజేపీలో చేర్పించేందుకు ఎంపీ సీఎం రమేష్ ప్రయత్నాలను ప్రారంభించారని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డితో కూడ బీజేపీ నాయకత్వం చర్చలు జరిపినట్టుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తనతో సన్నిహితంగా కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేరేలా కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించినట్టుగా ప్రచారంలో ఉంది. కానీ, ఈ విషయమై స్పష్టత లేదు.
ఐదేళ్ల క్రితం కూడ ఇదే తరహలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని కూడ ప్రచారం సాగింది. కానీ, కొత్త నేత ఎంపిక కోసం ఆ పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
ఏపీ రాష్ట్రంలో బలోపేతం కావడం కోసం ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొనే వ్యూహాన్ని కమల దళం ప్రయోగిస్తోంది. అయితే ఈ ప్రయోగం త్వరలోనే విజయవంతమయ్యే అవకాశం ఉందని బీజేపీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే కమలదళం ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతోందో చూడాలి.