ఎపిలో బిజెపి ప్లాన్: చంద్రబాబు కార్నర్, వైఎస్ జగన్ టార్గెట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడానికి బిజెపి నాయకత్వం పక్కా ప్లాన్ రచించి అమలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రణాళికను రచించి అమలు చేస్తోంది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడానికి బిజెపి నాయకత్వం పక్కా ప్లాన్ రచించి అమలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రణాళికను రచించి అమలు చేస్తోంది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది
తమ ప్రణాళికలో భాగంగా బిజెపి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కార్నర్ చేస్తుంది, ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యం చేసుకుంది. జగన్ కు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా బిజెపి నేతలు విమర్శల జడివాన కురిపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన నేపథ్యంలో వారిని కూడా వాడుకుని తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో బిజెపి నేతలు ఉన్నారు. తద్వారా చంద్రబాబును కార్నర్ చేసి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయం కావాలని చూస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బిజెపి నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఓడిపోయి, జగన్ గెలవడం పల్ల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లయిందని రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రజల విశ్వాసం కోల్పోయారని దగ్గుబాటి పురంధేశ్వరి అప్పుడే ప్రభుత్వంపై తీర్పులు చెప్పే వైఖరిని తీసుకున్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా అంతే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వంపై బిజెపి నేతలు విమర్శలు చేయడంలో మరో ఎత్తుగడ కూడా కనిపిస్తోంది. జగన్ ను ఎదుర్కోగలిగే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందని చాటుకుంటూ చంద్రబాబుకు ఆ సత్తా లేదని చెప్పదలుచుకున్నారు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ స్థానాన్ని బిజెపి ఆక్రమించాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ధీటుగా పోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు భావించవచ్చు.
అదే సమయంలో కేంద్ర సహాయం కూడా జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్ఱభుత్వానికి అందే సూచనలు కనిపించడం లేదు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ఆర్థిక ప్యాకేజీలు రాబట్టుకోవాలని బిజెపి నేతలు వైఎస్ జగన్ కు సూచిస్తున్నారు. ప్రత్యేక హోదాను తాను వదిలేస్తే ఏమవుతుందో జగన్ కు తెలుసు. చంద్రబాబు ఎదుర్కున్న పరిస్థితినే జగన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల జగన్ ప్రత్యేక హోదా నినాదాన్ని వదులుకునే స్థితిలో లేరు
అమరావతి ప్రాజెక్టు నుంచి రెండు బ్యాంకులు తప్పుకున్నాయి. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి విదేశీ బ్యాంకు తప్పుకుంది. దీనిపై జగన్ కు ప్రత్యామ్నాయం సూచించడానికి కూడా కేంద్రం సుముఖంగా లేదు. వేరే బ్యాంకులను చూసుకోవాలని కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రికి సూచిస్తున్నారు. అదే సమయంలో నిధులు కూడా కేంద్రం నుంచి అంతంత మాత్రంగానే అందే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ లక్ష్యం చేసుకుని రాజకీయంగా రాష్ట్రంలో ఎదగాలనే ఉద్దేశంతో బిజెపి నేతల్లో ఉందని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ
నిజానికి, చంద్రబాబు తనకే కాకుండా బిజెపికి కూడా రాజకీయ ప్రత్యర్థి అని జగన్ భావించి ఉంటారు. కానీ, అది నిజం కాదని తేలిపోయింది. రాష్ట్రంలో దశలవారీగా ఎదిగే క్రమంలో బిజెపి తొలుత చంద్రబాబును లక్ష్యం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నాలు సాగిస్తోంది. అందువల్ల చంద్రబాబు ఉమ్మడి శత్రువు అనే భావన నుంచి జగన్ వైదొలగాల్సే ఉంటుంది.