అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు: ఎపిలో పవన్, బాబులతో కలిసి బిజెపి స్కెచ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేసేందుకు బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను బట్టి చూసి, బిజెపి నేత అన్నం సతీష్ తాజా వ్యాఖ్యలను బట్టి పరిశీలించిన బిజెపి స్కెచ్ ఏమిటో అర్థమవుతోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేసేందుకు బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను బట్టి చూసి, బిజెపి నేత అన్నం సతీష్ తాజా వ్యాఖ్యలను బట్టి పరిశీలించిన బిజెపి స్కెచ్ ఏమిటో అర్థమవుతోంది. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు భావిస్తున్నారు.
మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని అయ్యన్నపాత్రుడు అన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ప్రకటనను బట్టి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని అనుకోవడానికి లేదు. బిజెపి మూడేళ్లలో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎజెండాతో బిజెపి ఎన్నికలకు వెళ్లవచ్చుననే పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులతో కలిసి బిజెపి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ కల్యాణ్ టీడీపీకి దూరంగా ఏమీ లేరని అర్థమవుతోంది. పైగా, ఆయన జగన్ నే తన ప్రధాన ప్రత్యర్థిగా చూస్తున్నారు.
చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ప్రధాన లక్ష్యమనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసిపిని ఓడించడానికి ఆయన పవన్ కల్యాణ్ తోనూ బిజెపితోనూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఆయన బిజెపికి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు తెలియజేస్తున్నాయి.
డిసెంబర్ లోగా జనసేన తమ పార్టీలో కలిసిపోతుందని బిజెపి నేత అన్నం సతీష్ మాటలను తేలిగ్గా కొట్టి పారేయలేం. జనసేనను బిజెపిలో పవన్ విలీనం చేస్తారా అనే విషయాన్ని పక్కనపెడితే బిజెపితో కలిసి పనిచేయడానికి ఆయన అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పవన్ కల్యాణ్ ను సిఎెంగా చూడాలని ఉందని కూడా అన్నం సతీష్ అన్నారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టి బిజెపి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే అవకాశాలు లేకపోలేదు.
పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు బిజెపితో కలిసి పనిచేస్తారా అనేది సందేహమే. టీడీపీని బలహీనపరచడానికి అవసరమైన చర్యలన్నీ బిజెపి ఇప్పటికే చేపట్టింది. చంద్రబాబు కలిసి రాకపోయినా బిజెపి పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.