తెలంగాణతో నదీ జలాల పంపకం: జగన్ కీలక ప్రకటన
ఏపీ అసెంబ్లీలో నీటి పారుదల ప్రాజెక్టులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతతో ఉంటామని కూడ ఆయన స్పష్టం చేశారు. గోదావరి నది జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయమై జగన్ స్పష్టత ఇచ్చారు.
గోదావరి నదీ జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీకి అందించే విషయమై రాష్ట్రానికి ప్రయోజనం కలిగితేనే ముందుకు సాగుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఒకవేళ ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ముందుకు సాగబోమని ఆయన స్పష్టం చేశారు.
గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో నదీ జలాలపై జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది. ఈ విషయమై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు జగన్ కౌంటరిచ్చారు.
గోదావరి నది జలాలు 12 శాతం కూడ రావడం లేదని ఏపీ సీఎం జగన్ చెప్పారు. గోదావరి నదీ జలాలను వాడుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని జగన్ సభలో ప్రస్తావించారు.
గోదావరి నది జలాల్లో కేవలం 5 శాతం మాత్రమే ఏపీ రాష్ట్రానికి వస్తున్నాయని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈ నీళ్లు కూడ శబరి నది వల్లే వస్తోందన్నారు. ఆల్మటి ఎత్తు పెంచడం వల్ల కృష్ణా ఆయకట్టుకు నీరు అందించే పరిస్థితి లేదని జగన్ అభిప్రాయపడ్డారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల ఆస్తి అని జగన్ చెప్పారు. గోదావరి నది జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించడం ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా ఆయకట్టుకు నీటిని అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతగా ఉండడం వల్ల ఇబ్బందేమిటని జగన్ ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తెలంగాణకే నీళ్లు రాని పరిస్థితి నెలకొందని జగన్ చెప్పారు. శ్రీశైలం ద్వారా గోదావరి నది నీటిని తరలిస్తే తనకు మంచి పేరు వస్తోందని టీడీపీకి భయం పట్టుకొందని జగన్ తెలిపారు.
టీడీపీ సభ్యులు మాట్లాడిన సమయంలో తాను కానీ తమ పార్టీ సభ్యులు కూడ అడ్డుపడలేదని జగన్ చెప్పారు. కానీ, తాను చెప్పే అంశం ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు మనుషులా... రాక్షసులా అంటూ జగన్ మండిపడ్డారు. సభ కార్యక్రమాలకు అంతరాయం కల్గించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని జగన్ విమర్శించారు.