నల్ల బ్యాడ్జీలు, చేతులకు సంకెళ్లు: లోకేష్ వినూత్న నిరసన
వివిధ వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ అసెంబ్లీ వద్ద టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.
అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ఏదో ఒక విషయంపై నిరసనకు దిగుతున్న విషయం తెలిసిందే. నిన్న(బుధవారం) వైసిపి హయాంలో ఇసుకను బంగారమయ్యిందంటూ నిరసనకు దిగిన టిడిపి ఇవాళ మీడియాపై ఆంక్షలపై నిరసనకు దిగారు. ఇందులో భాగంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంకెళ్లతో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు మిగతా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నిరసనలో పాల్గొన్నారు.
వివిధ వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ అసెంబ్లీ వద్ద టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి మీడియాను అనుమతించకపోడంపైనా టిడిపి ఆందోళన వ్యక్తం చేసింది. నాయకులంతా నల్ల కండువాలు, బ్యాడ్జీలతో వినూత్నంగా నిరసన తెలిపారు.
ఇలా వివిధ రకాలుగా నిరసన తెలుపుతూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలి నడకన బయలుదేరివెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను నిలిపేసి దాడులను నిలిపివేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.