బీజేపీ ఏపీ ప్లాన్: టీడీపీ ఎంపీలకు గాలం, చర్చలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీని మరింత దెబ్బతీసేందుకు కాషాయదళం ప్రయత్నాలను ప్రారంభించింది. పార్లమెంట్ ఉభయ సభల్లోని టీడీపీ ఎంపీలపై బీజేపీ గాలం వేస్తోంది.టీడీపీకి చెందిన ఎంపీలను తమ పార్టీలో చేర్చుకొంటే రాజ్యసభలో బలాన్ని పెంచుకొనేలా కమలదళం ప్లాన్ చేస్తోంది.
రాజ్యసభలో బీజేపీ మైనార్టీలో ఉంది. రాజ్యసభలో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీకి చెందిన ఎంపీలపై ఆ పార్టీకి చెందిన నేతలు చర్చలు ప్రారంభించారనే ప్రచారం సాగుతోంది.
టీడీపీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేష్, కనకమేడల రవీంద్రకుమార్పై బీజేపీ నేతలు కన్నేసినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై బీజేపీ నేతలు మాత్రం నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే రాజ్యసభలోని టీడీపీ ఎంపీలపై బీజేపీకి చెందిన కొందరు అగ్రనేతలు చర్చించినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై బీజేపీ నేతలు ఎవరు మాత్రం ధృవీకరించడం లేదు. లోక్సభలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు.
అయితే ఇప్పటికే కొందరు ఎంపీలతో బీజేపీ నేతలు చర్చించారని ప్రచారం సాగుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారాన్ని కేశినేని నాని ఖండించారు.కానీ పార్టీ నాయకత్వం తీరుపై కేశినేని నాని మాత్రం అసంతృప్తితో ఉన్నారు.
1992లో పీవీ నరసింహరావు హయంలో ఆరుగురు టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనాడు భూపతి విజయకుమార్ రాజు, ఇంద్రకరణ్ రెడ్డి, గంగారెడ్డగి, కేవీ చౌదరి, కేపీ రెడ్డయ్య, తోట సుబ్బారావు టీడీపీ నుండి చీలిపోయి మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వాన్ని రక్షించారు
ఏపీలో ప్రస్తుతం చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ నేతలు టీడీపీ ఎంపీలపై కన్నేశారని చెబుతున్నారు. టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులకు గాలం వేయడం ద్వారా ఆ పార్టీని మరింత దెబ్బతీయాలని కమలదళం ఆలోచిస్తోందని చెబుతున్నారు.