జగన్ కు మోడీ బంపర్ ఆఫర్: చంద్రబాబుకు దొరికినట్లే....
ఎన్డీఎలో చేరాల్సిందిగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీనే కాకుండా అమిత్ షాను కూడా కలిశారు.
న్యూఢిల్లీ: ఎన్డీఎలో చేరాల్సిందిగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీనే కాకుండా అమిత్ షాను కూడా కలిశారు. ఈ సందర్భంలో ఆయన జగన్ ను ఎన్డీఎలోకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
ఎన్డీఎలో చేరితే కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రెండు మంత్రి పదవులు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో జగన్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీని ఒక్కరినే కలవాల్సిన జగన్ అందువల్లనే బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కూడా కలిసినట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో మద్దతు ఇస్తానని వైఎస్ జగన్ గతంలో చెప్పారు
జగన్ ఎన్డీఎలో చేరుతారా, లేదా అనేది సందేహంగానే ఉంది. ప్రత్యేక హోదా సాధనకు తాము పోరాటం చేస్తామని జగన్ చెబుతున్నారు. పూర్తి మెజారిటీతో బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్డీఎలో చేరితే చేజేతులా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జగన్ అస్త్రాన్ని అందించినట్లే అవుతుంది.
జగన్ ఎన్డీఎలో చేరకపోతే కేంద్రం ఏ మేరకు రాష్ట్రానికి సాయం చేస్తుందనేది సందేహమే. తమకు రాజకీయంగా ఏ విధమైన ప్రయోజనం కూడా లేని రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం బిజెపికి ఇష్టం ఉందనేది ప్రతిపక్షాల విమర్శ. అందువల్ల జగన్ కు తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం, ప్రాజెక్టులను పూర్తి చేయడం కష్టంగా మారవచ్చు.