అమరావతి: పవన్ కల్యాణ్ డిమాండ్ లో చాతుర్యం ఇదే...
పవన్ కళ్యాణ్ రాజీనామా డిమాండ్ నిష్పాక్షికంగా మాత్రం కనబడడం లేదు. ఆయన డిమాండ్ లో తనకు కానీ, తన పార్టీకి కానీ, తమ భాగస్వామి బీజేపీకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగని డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.
అమరావతి రాజకీయాలు ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు రాజధానుల అంశం సృష్టించిన ప్రకంపనలు ఇంకొన్ని రోజులపాటు సాగనున్నాయి. పవన్ కళ్యాణ్ కృష్ణ, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేసారు.
ఆయన రాజీనామాల డిమాండ్ చేయగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలంటూ ఆయనొక సవాల్ విసిరారు. ఆయన సవాల్ విసరాగానే వైసీపీ నేతలేమో... సెంటిమెంటు ఉందా లేదా అనే విషయాన్నీ నిరూపించాల్సింది మీరు, దమ్ముంటే మీరు రాజీనామా చేసి గెలవండి అని వైసీపీ వారు ప్రతి సవాల్ విసిరారు.
ఈ సవాల్ ని అటుంచితే... అసలు సవాల్ ఈ రాజీనామాల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్. ఆయన గతంలో సైతం దమ్ముంటే రాజీనామాలు చేయాలనీ అనేకమార్లు డిమాండ్ చేసారు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని నిరూపించుకోమని డిమాండ్ చేసారు. బాగానే ఉంది.
ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజీనామా డిమాండ్ నిష్పాక్షికంగా మాత్రం కనబడడం లేదు. ఆయన డిమాండ్ లో తనకు కానీ, తన పార్టీకి కానీ, తమ భాగస్వామి బీజేపీకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగని డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.
ఆయన డిమాండ్ ను గనుక పరిశీలిస్తే... ఆయన చాలా తెలివిగా ఎమ్మెల్యేలను మాత్రమే రాజీనామా చేయమని డిమాండ్ చేసారు. అది కూడా కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందినవారిని మాత్రమే రాజీనామా చేయమని డిమాండ్ చేసారు.
ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ ని గనుక పరిశీలిస్తే ఇటు జనసేనకు, అటు బీజేపీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తెలివిగా ఆయన డిమాండ్ చేసారు. ఆయన పార్టీ అమరావతికి మద్దతిస్తుంది. ఆయన పార్టీకి ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా జనసేనలో లేడు.
బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఈ నేపథ్యంలోనే ఆయన కృష్ణ, గుంటూరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనీ కోరారు. ప్రజాప్రతినిధులంటే.... అందరూ. ఎమ్మెల్యేలయినా, ఎమ్మెల్సీలు అయినా కానీ ఆయన ఎమ్మెల్యేల్ని మాత్రమే డిమాండ్ చేయడం వల్ల బీజేపీకి తలనొప్పి కలగకుండా చూస్తే కృష్ణ గుంటూరు జిల్లాలు మాత్రమే అని చెప్పి తన పార్టీకి ఇబ్బందులు కలగకుండా చూసాడు.
అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ గనుక బీజేపీ నేతలను ఒప్పించి ఎమ్మెల్సీలతో రాజీనామా చేపించి అమరావతి కి సంబంధించి జగన్ మీద ఒత్తిడి తీసుకొస్తే బాగుండేది. సోము వీర్రాజు వంటి నేత రాజీనామా చేసి తన నిరసన తెలిపితే అది చాల బాగుండేది.
లేదా ప్రజల ఓట్లతో ప్రజాక్షేత్రంలో గెలిచినా మాధవ్ వంటి ఎమ్మెల్సీ రాజీనామా చేసి తిరిగి గెలిస్తే అమరావతి సెంటిమెంటును అదొక స్ఫూర్తిగా ఉండేది. పార్టీ అమరావతికి కట్టుబడి ఉందన్న మెసేజ్ కూడా బలంగా వెళ్ళేది ప్రజల్లోకి.
కానీ అలా జరగకుండా కేవలం రాజీనామా డిమాండ్ తో ఒరిగేది మాత్రం ఏమీ లేదు. రాజకీయంగా పవన్ నిర్ణయం తెలివైనదే కావొచ్చు. కర్ర విరగొద్దు పాము చావొద్దు అన్న రీతిలో పవన్ ఈ వ్యాఖ్య చేసాడు. కానీ పోరాడుతాను, ప్రజలకు అండగా నిలబడతాను అన్న విధంగా మాత్రం ఈ వ్యాఖ్య లేదు.
పవన్ కళ్యాణ్ గనుక బీజేపీ పెద్దలతో తనకున్న సాన్నిహిత్యంతో వెళ్లి వారిని ఒప్పించి... బీజేపీని బలంగా అమరావతి విషయంలో దింపి ఉంటే... పవన్ ఇమేజ్ తో పాటుగా మాటకు కట్టుబడ్డవాడిగా పవన్ కళ్యాణ్ కి మంచి పేరు వచ్చి ఉండేది. కానీ ఆయన మాత్రం మాటలు మాట్లాడుతున్నాడు, రాజకీయాలు చేస్తున్నాడు తప్ప, సమస్యపై ఇదివరకపటిలా పోరు మాత్రం సాగించడంలేదు..!