ఇఫీలో ఒకే ఒక్క తెలుగు సినిమా `గతం`.. జనవరిలో ఈ గోవా ఫెస్టివల్
`గతం` సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. తెలుగు నుంచి ఎంపికైన ఒకే ఒక్క చిత్రం ఇదే కావడం విశేషం.
తెలుగులో ఇటీవల ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకున్న `గతం` సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. తెలుగు నుంచి ఎంపికైన ఒకే ఒక్క చిత్రం ఇదే కావడం విశేషం. అయితే కేవలం ఒకే సినిమా తెలుగు నుంచి ఎంపిక కావడం బాధాకరం. ఇండియన్ పనోరమా కేటగిరిలో ఇది అవార్డు కోసం పోటీపడుతుంది.
థ్రిల్లర్ కథాంశంతో కిరణ్ కొండమడుగుల దీనిని తెరకెక్కించారు. భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా.. భార్గవ పోలుదాసు, సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్ ప్రతాప్లు కలిసి సినిమాను నిర్మించారు. ఇక శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. సస్పెన్స్, ట్విస్టులతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇప్పుడు జనవరి 17న గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఫంక్షన్లో పనోరమా కేటగిరీలో ప్రదర్శితమయ్యే సినిమాగా స్థానాన్ని సంపాదించుకుంది. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా ఒక ప్రధాన భాగం. బెస్ట్ ఇండియన్ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ప్రోత్సహించేందుకు గాను 1978లో దీనిని ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు.
ఇందులో తెలుగు సినిమాతోపాటు 23 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఉన్నాయని కేంద్ర సమాచార ప్రసారమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఇందులో హిందీ నుంచి `ఆవర్టన్`, `సాండ్ కి ఆంఖ్`, `చిచ్చోర్` చిత్రాలుండగా, తమిళం నుంచి `థీన్`, ధనుష్ `అసురన్` చిత్రాలున్నాయి. `చిచ్చోర్`లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన విషయం తెలిసిందే.