రాజమౌళి - రామ్ చరణ్ బ్లాక్ బాస్టర్ మూవీ... ‘మగధీర’ రీరిలీజ్.. ఎప్పుడో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలోని బ్లాక్ బాస్టర్ మూవీ ‘మగధీర’ రీరిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా రీరిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
టాలీవుడ్ లో కొద్దికాలంగా రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మెగా బ్లాక్ బస్టర్ ‘మగధీర’ (Magadheera) చిత్రం మార్చి 26న థియేటర్లలో రీరిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు, శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నామన్నారు. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు.
ఇక రామ్ చరణ్ నెక్ట్స్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అటు జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘ఎస్ఎస్ఎంబీ29’ చిత్రంతో బిజీ కానున్నారు. ఈ సినిమా జూన్ లో అధికారికంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది.