పుష్ప 2 చిత్రం రిలీజ్ టైంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనని ఎవరూ మరచిపోలేరు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లు రాబట్టింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరో అయ్యారు. ఇదంతా ఒకెత్తయితే.. పుష్ప 2 వెనుక విషాదం కూడా ఉంది. పుష్ప 2 చిత్రం రిలీజ్ టైంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనని ఎవరూ మరచిపోలేరు.
అభిమానులతో కలసి అల్లు అర్జున్ పుష్ప 2 చూసేందుకు సంధ్య థియేటర్ కి వెళ్లడంతో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కుమారుడు 9 ఏళ్ళ శ్రీతేజ్ గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. గత ఐదు నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్న శ్రీతేజ్ ఎట్టకేలకు డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు ఐదు నెలలుగా శ్రీతేజ్ కి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగింది.
ఒక దశలో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా కూడా మారింది. అయితే శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. కానీ ఇప్పటికీ శ్రీతేజ్ తన తండ్రిని, ఇతరులని గుర్తించేలేకున్నాడు. ప్రస్తుతం శ్రీతేజ్ లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ని రీహాబిటేషన్ సెంటర్ కి తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట సంఘటనలో ఊపిరి ఆడకపోవడం వల్ల శ్రీతేజ్ కి బ్రెయిన్ సమస్యలు తలెత్తాయి. శ్రీతేజ్ చికిత్స కోసం అల్లు అర్జున్, మైత్రి మూవీస్ సంస్థ, అదే విధంగా టాలీవుడ్ లో కొందరు ప్రముఖులు ఆర్థిక సాయం ప్రకటించారు. అల్లు అర్జున్ కోటి రూపాయలు సాయం అందించగా, మైత్రి సంస్థ 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు అందించారు.
తొక్కిసలాట సంఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, జైలుకి వెళ్లడం, ఆ తర్వాత బెయిల్ పై తిరిగి రావడం జరిగింది. ఈ సంఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది.
