మరింత చేస్తానంటున్న సోనూ.. 20 వేల మందికి వసతి, ఉద్యోగం
తాజాగా మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు సోనూ సూద్. 20వేల మంది వలస కార్మికులకు వసతి ఏర్పాట్లు చేయటంతో పాటు, ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించేందుకు సోనూ సూద్ ఏర్పాట్లు చేశాడు. ప్రవాసీ రోజ్గార్ ద్వారా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పాడు సోనూ.
కరోనా లాక్ డౌన్ సమయంలో జాతీయ స్థాయిలో మారు మోగిన పేరు సోనూ సూద్. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సెలబ్రిటీలు అంతా డబ్బు సాయం చేసి చేతులు దులుపుకుంటే సోనూ సూద్ మాత్రం స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లాక్ డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేకపోయిన వలస కూలీలను తన సొంత ఖర్చులతో బస్సులు, విమానాలు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు చేర్చాడు.
ఆ తరువాత కూడా తన సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన విషయాలపై కూడా స్పందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ. తెలుగు రాష్ట్రల్లోని వారికి కూడా సోనూ సూద్ సాయం అందింది. అంటేనే ఆయన ఏ స్థాయిలో సేవ కార్యక్రమాలు చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు సోనూ సూద్.
20వేల మంది వలస కార్మికులకు వసతి ఏర్పాట్లు చేయటంతో పాటు, ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించేందుకు సోనూ సూద్ ఏర్పాట్లు చేశాడు. ప్రవాసీ రోజ్గార్ ద్వారా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పాడు సోనూ. ఈ కార్యక్రమానికి ఎన్ఏఈసీ అధ్యక్షుడు లలిత్ ఠుక్రాల్ సాయం చేశారని ఆయన తెలిపారు. కార్మికులందరికీ ఆరోగ్యకరమైన వసతి ఏర్పాట్లు చేస్తున్నామని సోనూ వెల్లడించాడు.