బ్రేకింగ్ : ప్రముఖ గాయని వాణీ జయరామ్ కన్నుమూత
ప్రముఖ గాయని వాణీ జయరామ్(77) ఇక లేరు.చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ గాయని వాణీ జయరామ్(77) ఇక లేరు.చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. గాయనిగా ఆమె తెలుగు, తమిళం, హిందీ, కన్నడ అన్ని భాషల్లో ఎన్నో పాటలతో అలరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకి పద్మ భూషణ్ అవార్డు కూడా ప్రకటించింది. మధుర గాయని మృతితో చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నట్లు అయింది. తన బెడ్రూంలో కాలు జారిపడి మరణించినట్లు భావిస్తున్నారు. ఆమె ముఖంపై, నుదురుపై తీవ్రమైన గాయాలున్నాయి.
1945 నవంబర్ 30వ తేదీన తమిళనాడులోని వేలూరులో జన్మించిన వాణీ జయరామ్ దాదాపు 5 దశాబ్దాలు సంగీత ప్రియులని తన గాత్రంతో అలరించారు. ఆమె అసలు పేరు కలైవాణి. 8 ఏళ్ళ చిన్నవయసులోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతూ వాణీ జయరామ్ తన ప్రతిభ చాటుకున్నారు.
తెలిమంచు కరిగింది.. ఎన్నెన్నో జన్మల బంధం.. ఒక బృందావనం లాంటి సూపర్ హిట్ సాంగ్ ఆమె గాత్రం నుంచి జాలువారినవే. అన్ని భాషల్లో కలిపి ఆమె 14 వేల పాటలు పాడారు. కెవి మహదేవన్, ఇళయరాజా, ఎమ్మెస్ విశ్వనాథ్ , చక్రవర్తి లాంటి ప్రముఖ సంగీత దర్శకులు వాణీ జయరామ్ తో పాటలు పాడించారు. ఇటీవలే రిపబ్లిక్ డే సందర్భంగా వాణీ జయరామ్ కి కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు కూడా ప్రకటించింది. కానీ ఇంతలోనే ఆమె మరణించడం తీరని విషాదం అనే చెప్పాలి.
వివాహం తర్వాత తన భర్త ప్రోత్సాహంతో గాయనిగా మరింత ఎదిగారు. 1975లో వాణీ జయరామ్ తొలిసారి తమిళ చిత్రం అపూర్వ రాగంగళ్ లో పాడిన పాటలకి గాను ఆమె జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆల్ టైం క్లాసిక్ శంకరాభరణం చిత్రంలో పలు పాటలు పాడి మరోసారి జాతీయ అవార్డు కైవసం చేసుకున్నారు. 1991లో స్వాతికిరణం చిత్రానికి మూడవసారి ఆమెకి నేషనల్ అవార్డు దక్కింది. శంకరాభరణం చిత్రాన్ని తెరకెక్కించిన ది గ్రేట్ కె విశ్వనాథ్ మరణించిన మరుసటి రోజే వాణీ జయరామ్ మరణించడం జీర్ణించుకోలేని అంశం.
వాణీ జయరామ్ భర్త పేరు జయరామ్. ఈ దంపతులకు పిల్లలు లేరు. శంకరాభరణంతో పాటు ఆమె శృతి లయలు, స్వర్ణకమలం లాంటి విశ్వనాధ్ చిత్రాలకు కూడా ఆమె పాటలు పాడారు. ఆమె మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖులంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మృతి గురించి పోస్ట్ లు చేస్తున్నారు.