Kaikala Satyanarayana:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanaraana) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి లేఖ రాశారు. అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం చేసిన ఆయన ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన ఏపీ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి (CM YS Jaganmohan reddy)లేఖ రాశారు. అలాగే తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు.
మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని ఆయన అన్నారు. మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది, ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని కైకాల పేర్కొన్నారు. అనారోగ్యం పాలైనప్పటి నుంచి అండగా ఉన్నందుకు నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్న, అని చెబుతూ ఆయన నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు.
తాను సంతకం చేయలేక పోవడంతో, తన కుమారుడు కొడుకు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని ఆయన వెల్లడించారు. అంతే కాక తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు.
ఒక దశలో కైకాల ఆరోగ్యం అత్యంత విషమ స్థితికి చేరుకుంది. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యాయంటూ అపోలో వైద్యులు వెల్లడించారు. అయితే సంకల్ప బలం, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో తిరిగి కోలుకున్నారు. మొదటితరం తెలుగు నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. టాలీవుడ్ కురువృద్ధుడుగా ఆయన్ని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సమకాలికుడిగా వాళ్లతో వందల చిత్రాలు కలిసి చేశారు.