కమ్ బ్యాక్ తర్వాత పవన్ కళ్యాణ్ నాలుగైదు చిత్రాలకు కమిటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు నిర్మాతల వద్ద కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అయితే అనుకున్న ప్రకారం చిత్రాలు సెట్స్ పైకి వెళ్లకపోవడంతో నిర్మాతలు అడ్వాన్స్ వెనక్కి అడుగుతున్నారట.

2019 చివర్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కమ్ బ్యాక్ ప్రకటించారు. వకీల్ సాబ్ తో పాటు హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి చిత్రాలు వరుసగా ప్రకటించారు. వీటిలో పవన్ పూర్తి చేసింది ఒక్క వకీల్ సాబ్ మాత్రమే. ముందుగా ఒప్పుకున్న హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలు పక్కనపెట్టి భీమ్లా నాయక్ పూర్తి చేశాడు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీరమల్లు కొంత భాగం చిత్రీకరణ జరిగాక పవన్ హోల్డ్ లో పెట్టాడు. ఇక భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్ళలేదు. 

భవదీయుడు భగత్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు కాగా... మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అనుకున్న ప్రకారం ఈ మూవీ మొదలైతే సగానికి పైగా షూటింగ్ పూర్తి కావాల్సింది. అయితే పవన్ రాజకీయ కార్యక్రమాలతో పాటు మధ్యలో భీమ్లా నాయక్ చేయడం వలన ఆలస్యమైంది. సగం షూటింగ్ పూర్తి చేసుకున్న హరి హర వీరమల్లు పరిస్థితే అర్థం కాకుండా ఉంది. అక్టోబర్ నుండి పవన్ బస్సు యాత్ర చేయనున్నారు. ఇక భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లడం జరగని పని అని నిర్మాతలు భావిస్తున్నారు. ఒక వేళ ఈ మూవీ కార్యరూపం దాల్చినా కనీసం రెండేళ్ల తర్వాతే. 

 ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే మైత్రి మూవీ మేకర్స్ పవన్ కి రూ. 40 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారట. అంత పెద్ద మొత్తం పవన్ దగ్గర ఆగిపోవడం, మరో వైపు సినిమా గందరగోళంలో పడడంతో అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని పవన్ ని మైత్రి మూవీ మేకర్స్ కోరుతున్నారట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ... టాలీవుడ్ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది.