కేంద్ర సమాచార ప్రసారాల శాఖ చిరంజీవికి `ఇండియన్‌ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్ 2022`కి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా చిరుకి ప్రధాని మోడీ విషెస్‌ చెప్పారు.

మెగాస్టార్‌ చిరంజీవికి ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలియజేశారు. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం `ఇండియన్‌ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్` పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని ఆయనకు ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. ఈ పురస్కారాన్ని ఆదివారం చిరంజీవికి ప్రకటించిన విషయం తెలిసిందే. 

`చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్నమైన నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణనూ చూరగొన్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్‌ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా చిరంజీవికి అభినందనలు` అని పేర్కొన్నారు మోడీ. తెలుగులో ఆయన ట్వీట్ చేయడం విశేషం. 

Scroll to load tweet…

పీఎం మోడీ విషెస్‌ చెప్పిన నేపథ్యంలో చిరు స్పందించారు. ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. మంచి మాటలు చెప్పిన పీఎం నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. అపారమైన గౌరవం, వినయంతో కూడిన అనుభూతి కలిగిందని చెప్పారు. 

Scroll to load tweet…

ఇండియన్‌ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేకమైన పురస్కారాన్ని అందజేస్తున్నారు. 2013 నుంచి ఈ అవార్డులను అందిస్తున్నారు. ఇప్పటి వరకు వహీదా రెహ్మాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం, అమితాబ్‌ బచ్చన్‌, సలీమ్‌ ఖాన్‌, బిశ్వజిత్‌ చటర్జీ, హేమా మాలిని, ప్రసూన్‌ జోషిలకు అందజేశారు. 2022కిగానూ చిరంజీవిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నెమలి బొమ్మతో ఉన్న రజత పతకం, పది లక్షల రూపాయలు, ధృవీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. 

ఇక చిరంజీవి ఇప్పటి వరకు 153 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం 154 చిత్రం `వాల్తేర్‌ వీరయ్య`లో నటిస్తుంది. బాబీ దర్శకుడు. శృతి హాసన్‌ కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. దీంతోపాటు `భోళా శంకర్‌` లో నటిస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, ఇందులో కీర్తిసురేష్‌ చిరుకి చెల్లిగా నటిస్తుంది. ఇటీవల `గాడ్‌ ఫాదర్‌` చిత్రంతో ఆకట్టుకున్నారు చిరంజీవి.