మోహన్‌బాబు హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ సారి రీమేక్‌ సినిమాతో రాబోతున్నారు. మలయాళ రీమేక్‌లో మోహన్‌బాబు నటించబోతున్నట్టు సమాచారం. 

నాలుగున్నర దశాబ్దాల సినీ జీవితంలో కలెక్షన్ కింగ్‌గా, విలక్షణ నటుడిగా రాణించారు మోహన్‌బాబు. హీరోగా, విలన్‌గా, కీ రోల్స్ చేసి మెప్పించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. సినిమాలు వరుసగా పరాజయం చెందుతున్నాయి. ఆ మధ్య మోహన్‌బాబు `సన్నాఫ్‌ ఇండియా` చిత్రంతో వచ్చారు. ఓటీటీ కోసం చేసిన ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్‌ చేసి విమర్శలందుకున్నారు. దారుణమైన ట్రోల్స్ కి గురయ్యారు మోహన్‌బాబు. 

ఇతర స్టార్‌హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ సక్సెస్‌ అవుతున్న విలక్షణ నటుడు ఇప్పుడు మెయిల్‌ లీడ్‌గా మరో సినిమా చేయబోతున్నారు. ఓ రీమేక్‌లో ఆయన నటించబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల మంచు విష్ణు `ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25` అనే మలయాళ చిత్ర రీమేక్‌ రైట్స్ తీసుకున్నారు. అక్కడ ఇది మంచి విజయాన్ని సాధించడంతోపాటు ప్రశంసలందుకుంది. 

ఈ చిత్రాన్ని మోహన్‌బాబు హీరోగా రీమేక్‌ చేయాలనుకుంటున్నారట మంచు విష్ణు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈసినిమా సాగుతుందని, ఇందులో మోహన్‌బాబు తండ్రిగా నటిస్తారని, కొడుకు పాత్రలో మంచు విష్ణు కాకుండా మరో యంగ్‌ హీరోని నటింపచేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం రీమేక్‌ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే సినిమాని, దర్శకుడిని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. 

మంచు విష్ణు ప్రస్తుతం `జిన్నా` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.