సారాంశం

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్‌ని అడ్డగా చేసుకుని దారుణానికి తెగబడ్డారు. తాజాగా పహల్గామ్‌ ప్రాంతంలో టూరిస్ట్ లపై దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 27 మంది టూరిస్ట్ లు మరణించారు. ఈ ఘటన యావత్‌ దేశాన్ని కలిచివేసింది. దీనిపై అందరు స్పందిస్తూ టెర్రరిస్ట్ ఎటాక్‌ని ఖండిస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా దీన్ని స్ట్రాంగ్‌గా ఖండించారు. మోహన్‌ బాబు, పవన్‌, రామ్‌ చరణ్‌, మంచు విష్ణు వంటి వారు దీనిపై రియాక్ట్ అయ్యారు. వారు ఏం చెప్పారంటే. 
 

జమ్మూ కశ్మీర్‌లో దారుణమైన ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 27 మంది టూరిస్ట్ లు మరణించారు. చాలా కాలం తర్వాత ఇండియాపై టెర్రరిస్ట్ లు జరిపిన దాడి ఇది. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అనంత్‌ నాగ్‌ జిల్లా పహల్గామ్‌ టూరిస్ట్ ప్రాంతంలో అమానవీయంగా కాల్పులు జరిపారు. ఇందులో 27 మంది టూరిస్ట్ లు అక్కడిక్కడే మరణించగా మరో 20 మందికిపైగానే గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. 

ఈ ఘటనతో యావత్‌ భారత్‌ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యింది. దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈఘటనపై యావత్‌ భారత్‌ స్పందిస్తుంది. టెర్రర్‌ ఎటాక్‌ని ఖండిస్తుంది. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అయ్యారు. ఇది  దారుణమైన చర్యగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తాజాగా హీరో మోహన్‌ బాబు స్పందించారు. ఈ ఘటనని ఆయన తీవ్రంగా ఖండించారు. పహల్గామ్‌లో జరిగింది కేవలం ప్రాణాలపై దాడి కాదు, మానవత్వంపై జరిగిన దాడి, ఉగ్రవాదానికి మతం లేదు, దీనికి ఎలాంటి సమర్థన లేదు. బాధితుల కుటుంబాలకు నా హృదయం విలపిస్తోంది. భారతదేశం గొప్ప దేశం, మా నాయకులు తగిన ప్రతిస్పందన ఇస్తారని నేను నమ్ముతున్నాం. మేం ఐక్యంగానే ఉన్నాం` అని తెలిపారు మోహన్‌ బాబు. 

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ, మినీ స్విట్జర్లాండ్‌గా పిలవబడే జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని అనంత్‌ నాగ్‌ ప్రాంతంలోని బైసారన్‌లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడి వార్తతో నేను చలించిపోయాను. 27 మంది అమాయక పర్యాటకుల మరణాలు, 20 మంది గాయపడటం చాలా భయంకరమైనది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం,గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. 

ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి, కేంద్ర బలగాలతో పూర్తి సమన్వయం ఉండేలా చూసుకోవాలని, పర్యాటకులు, స్థానిక పౌరుల ప్రాణాలను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఉగ్రవాద ముప్పులను తొలగించడానికి, జాతీయ భద్రతను నిర్థారించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాత్మక చర్యకైనా మనదేశ పౌరులందరు పూర్తి మద్దతు ఇస్తారు` అని వెల్లడించారు పవన్‌ కళ్యాణ్‌. 

రామ్‌ చరణ్‌ ఈ ఘటనపై స్పందించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యాను. ఇలాంటి సంఘటనలకు సమాజంలో స్థానం లేదు. దీన్ని తీవ్రంగా ఖండించాలి. బాధిత కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నా` అని తన సంతాపం తెలిపారు రామ్‌ చరణ్‌.

మంచు విష్ణు రియాక్ట్ అవుతూ, పహల్గామ్‌ లో జరిగిన పిరికి దాడి హృదయ విదారకం. మనం కోల్పోయిన ధైర్యవంతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి క్షణాల్లో మనం మరింత బలంగా నిలబడాలి. దుఖంలో ఐక్యంగా స్ఫూర్తితో ఐక్యంగా, ఉగ్రవాదం మనల్ని ఎప్పటికీ విభజించలేదు` అని స్ఫూర్తినిచ్చే కామెంట్స్ చేశారు మంచు విష్ణు. వీరితోపాటు మరికొందరు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ సెలబ్రిటీలు స్పందించి మృతులకు సంతాపం తెలిపారు. టెర్రరిస్ట్ ఎటాక్‌ని తీవ్రంగా ఖండించారు. 
 

read more:Pahalgam Terror Attack: హనీమూన్‌కి వచ్చిన జంట.. శవమైన భర్త.. ముస్లిమా కాదా అని అడిగి మరీ కాల్చిపడేశారంట..!