నిర్మాతగా సిల్వర్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేసిన ఏ ఎం రత్నం హరి హర వీరమల్లు సినిమాతో కష్టాలు పడుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ గట్టెక్కించడానికి నానా అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఆయనకు కొత్తగా మరో సమస్య వచ్చిపడింది.
నిర్మాతగా ఏ ఎం రత్నం(AM Ratnam) ఘనమైన చరిత్ర కలిగి ఉన్నారు. ఆల్ టైం బ్లాక్ బస్టర్ కర్తవ్యం సినిమాతో నిర్మాతగా మారిన రత్నం శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లో గొప్ప చిత్రాలు తెరకెక్కించారు. భారతీయుడు, ఖుషి, రన్, 7జి బృందావన కాలనీ వంటి ఎవర్ గ్రీన్ హిట్స్ ఈ బ్యానర్ లో తెరకెక్కాయి. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఏ ఎం రత్నం పదుల సంఖ్యలో వివిధ భాషల్లో చిత్రాలు నిర్మించారు. అలాంటి సీనియర్ నిర్మాతను పవన్ కళ్యాణ్ ముప్పతిప్పలు పెడుతున్నారు. తన రాజకీయ అజెండాల కారణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు మూవీ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది . లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ నిర్మాణం సకాలంలో జరగలేదు. సినిమా ఆలస్యం కావడం వలన మూవీ బడ్జెట్ అంచనా దాటిపోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక త్వరితగతిన షూటింగ్ పూర్తి చేద్దామనుకున్న రత్నంకి పవన్ ఝలక్ ఇచ్చాడు. హరి హర వీరమల్లు పక్కన పెట్టి భీమ్లా నాయక్ పూర్తి చేశాడు. సరే భీమ్లా నాయక్ తర్వాతైనా హరి హర వీరమల్లు(Hari hara veeramallu) సెట్స్ కి వస్తాడనుకుంటే అది జరగలేదు. స్క్రిప్ట్ సాకుగా చూపి పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీ అయ్యాడు.
సాధారణంగా హీరో స్క్రిప్ లాక్ చేశాకే షూటింగ్ మొదలుపెడతారు. షూటింగ్ మధ్యలో పవన్ మార్పులు కోరడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. చేసేది లేక పవన్ ఇష్టప్రకారం మార్పులు చేసి దర్శకుడు క్రిష్, రత్నం పవన్ ని ఒప్పించారు. ఆగస్టు నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని ఒప్పందం చేసుకున్నారు. అనూహ్యంగా ఆగస్టు నుండి షూటింగ్స్ కి విరామం ప్రకటిస్తూ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రత్నంకి బిగ్ షాక్ ఇచ్చింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లైంది.
హరి హర వీరమల్లు ఫలితంతో సంబంధం లేకుండా నిర్మాతలకు నష్టాలు రావడం ఖాయం. బడ్జెట్ లెక్కలు నేపథ్యంలో రత్నం నిండా మునిగిపోయారు. సినిమా పూర్తి చేసి విడుదల చేయడం ద్వారా ఎంతో కొంత మేర నష్టం తగ్గించుకోవాలని చూస్తున్నారు. సినిమా మధ్యలో ఆగిపోయినా, మరింత ఆలస్యమైనా భారీ మొత్తంలో డబ్బులు కోల్పోవాల్సి ఉంటుంది. ముళ్ల మీద పడ్డ చీర జాగ్రత్తగా తీసుకోవాలి. అదే విధానం రత్నం అవలంబిస్తున్నారు.