అల్లు అర్జున్ని కలిసిన గవర్నర్.. ఏకంగా ఇంటికెళ్లి మరీ అభినందనలు..
అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏకంగా ఆయన్నింటికెళ్లి సత్కరించడం విశేషం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. తెలుగు నటుల నుంచి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుకి ఎంపికైన తొలి నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, కృష్ణ, మోహన్బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వరకు ఎవరీ సాధ్యం కానిది బన్నీకి సాధ్యమైంది. నేషనల్ అవార్డుకి ఎంపికైన సందర్భంగా బన్నీకి విశేష ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా సత్కారాలను అందుకుంటున్నారు బన్నీ. తాజాగా ఆయన్ని ఏకంగా గవర్నర్ కలవడం విశేషం.
హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బన్నీని కలిశారు. సోమవారం ఏకంగా అల్లు అర్జున్ ఇంటికెళ్లి మరీ ఆయన్ని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బండారు దత్తాత్రేయ ఆయన్ని శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా కాసేపు బన్నీతో ముచ్చటించారు గవర్నర్ దత్తాత్రేయ. ఇందులో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎదుగుదల గురించి బన్నీ గవర్నర్కి వివరించారట. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
`పుష్ప` చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాకి మ్యూజిక్ విభాగంలోనూ దేవిశ్రీ ప్రసాద్కి నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. సుకుమార్ రూపొందించిన `పుష్ప`లో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్గా నటించారు. ఇందులో పూర్తి డీ గ్లామర్గా, ఊరమాస్ రోల్ చేశాడు బన్నీ. ఇక సినిమాలో తనకు జోడీగా రష్మిక మందన్నా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. 2021 డిసెంబర్లో ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో సమంత చేసిన ఐటెమ్ సాంగ్ ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రెండో పార్ట్ లో బన్నీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నేషనల్ అవార్డు వచ్చిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.