స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకుడిగా అందరికీ సుపరిచితుడే. కానీ ఆయనలోని మరో కోణాన్ని గుర్తించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు పూరి కొన్నేండ్ల కలను చిరు నెరవేర్చుతూ.. ఆయన ఫ్యాన్స్ కు ఊహించని విధంగా ట్రీట్ ఇచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Jagannadh)పై ఉన్న అభిమానాన్న బయటపెట్టారు. చిరు చాలా కాలం తర్వాత నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `గాడ్ ఫాదర్`(God Father). ఈ సినిమా మాలయాళంలో మోహన్లాల్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం `లూసిఫర్`కు రీమేక్. తెలుగులో దీన్ని `గాడ్ ఫాదర్` పేరుతో దర్శకుడు మోహన్రాజా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తయింది.
తాజాగా చిరు అభిమానులకు మరో తీపి కబురు చెప్పారు. గాడ్ ఫాదర్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఓ స్పెషల్ రోల్ చేయనున్నారని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా పూరికి స్వాగతం పలికారు. ‘నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి, అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే పూరి జగన్నాథ్ ను గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రత్యేక పాత్ర ద్వారా నటుడిగా పరిచయం చేస్తున్నాం.’ అని ట్వీట్ చేశాడు.
నిజానికి పూరి జగన్నాథ్ కు కూడా మొదట్లో నటుడిగా మెప్పించాలనే కోరిక ఉంది. గతంలో ఆయన ఈ విషయాన్ని కూడా తెలియజేశాడు. కానీ డైరెక్టర్ గా తనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావడం.. ఆ దిశగానే ఆఫర్లూ క్యూ కట్టడంతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. మరోవైపు చిరు 150 సినిమాను వాస్తవానికి పూరి జగన్నాథే డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ, డైరెక్టర్ వీవీ వినాయక్ ‘ఖైదీ 150’కి దర్శకత్వం వహించిన విషయం తెలిందే. ఏదేమైనా చిరు, పూరి ఇద్దరు కలిని స్క్రీన్ పై కనిపించబోతుండటం పట్ల మెగా అభిమానులు, పూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.