సారాంశం
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025 చాలా ఘనంగా స్టార్ట్ అయ్యింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ ఈవెంట్లో చిరంజీవి సందడి చేశారు.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025 లో సినిమా తారలు సందడి చేశారు. ఈ సమ్మిట్ ను ప్రధానమంత్రి మోదీ ఘనంగా ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు సాగనుంది. ఇక ఈ ఈవెంట్లో టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, తదితరులు పాల్గున్నారు. ఇక ఈ స్టార్ హీరోలకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. బుధవారమే చిరంజీవి ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి ముంబయి చేరుకున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వినోద పరిశ్రమను గ్లోబల్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'వేవ్స్' సదస్సును నిర్వహిస్తోంది.నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం లో మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోదీ ఏకంగా 10 గంటల సమయాన్ని కేటాయించడం విశేషం.
ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. చిన్నతనంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్నానని, ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడానికి డ్యాన్స్ చేసేవాడినని గుర్తుచేసుకున్నారు. ఆ ఆసక్తే తనను నటన వైపు నడిపించిందని, అందుకోసం చెన్నై వెళ్లానని తెలిపారు. తాను సినీ రంగంలోకి అడుగుపెట్టే సమయానికి అప్పటికే ఎందరో దిగ్గజ నటులు, సూపర్ స్టార్లు ఉన్నారని చిరంజీవి అన్నారు. వారందరికంటే ప్రత్యేకంగా ఏదైనా చేయాలి అనే తపన తనను ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు. అంతే కాదు చాలామంది నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు చిరంజీవి. మేకప్ లేకుండా సహజంగా నటించడం మిథున్ చక్రవర్తి నుంచి, స్టంట్స్ విషయంలో అమితాబ్, డాన్స్ విషయంలో కమల్ హాసన్, తనకు ప్రేరణగా నిలిచారని చిరంజీవి అన్నారు.