అతి చిన్న చిత్రంగా విడుదలైన బలగం కనీవినీ ఎరుగని విధంగా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణాలో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ చిత్రం చొచ్చుకుని పోయింది.
అతి చిన్న చిత్రంగా విడుదలైన బలగం కనీవినీ ఎరుగని విధంగా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణాలో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ చిత్రం చొచ్చుకుని పోయింది. తెలంగాణ గ్రామాల్లో ఉన్న బంధాలు, పల్లెటూరి ప్రజలు.. మరణం తర్వాత ఉండే ఆచార వ్యవహారాల్ని దర్శకుడు వేణు ఎల్దండి కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఈ చిత్రం చూసి కంటతడి పెట్టని ప్రేక్షకులు అంటూ లేరు.
ప్రతి గ్రామంలో ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించేంతగా బలగం మూవీ ప్రజల్లోకి వెళ్ళింది. అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించడం చూశాం. దర్శకుడు వేణుని అభినందించారు. అయితే తాజాగా బలగం చిత్రానికి సంబంధించిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఈ మూవీలో గ్రామ సర్పంచ్ పాత్రలో నటించిన నటుడు నర్సింగం ఇక లేరు. ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు వేణు ఎల్దండి స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. 'నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి .. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి బలగం కథ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను. ఆరోజు కల్లు, గుడాలు తెప్పించాడు నాకోసం..అంటూ వేణు ఎమోషనల్ గా నర్సింగంని గుర్తు చేసుకున్నారు.
నర్సింగం బలగం చిత్రంలో ఊరి పెద్దగా, సర్పంచ్ గా తీర్పు ఇవ్వడం, పంచాయతీ పెట్టడం లాంటి సన్నివేశాల్లో మెరిశారు. ఇదిలా ఉండగా నర్సిగం మృతితో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్య సమస్యలతో నర్సింగం మృతి చెందినట్లు తెలుస్తోంది.
