ఇద్దరు లెజెండరీ సింగర్ల పాటకు స్టెప్పులేస్తున్నా.. యువీ ఫన్నీ ట్వీట్.. వీడియో వైరల్
Yuvraj Singh: టీమిండియా మాజీ ఆల్ రౌండర్, రెండు ప్రపంచకప్ లు అందించడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో పాల్గొంటున్నాడు.
యువరాజ్ సింగ్ అంటేనే ఫన్ కు పర్యాయపదం. అతడెక్కడుంటే అక్కడ సందడే. తాజాగా యువీ.. లెజెండ్స్ లీగ్ లో భాగంగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తన పాత మిత్రులతో కలిసి హంగామా చేశాడు. ఇండియా లెజెండ్స్ తరఫున ఆడుతున్న యువీ.. సచిన్ టెండూల్కర్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా లతో కలిసి సరదాగా గడిపాడు. ఓ పార్టీలో వీరంతా ఎంజాయ్ చేయగా అందుకు సంబంధించిన వీడియోను యువీ తాజాగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
వీడియోలో యువీ.. పలు బాలీవుడ్ పాటలకు స్టెప్పులేశాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా లు పాట పాడగా యువీ వాళ్ల పాటకు కాలు కదిపాడు. ఈ వీడియోను యువీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తూ ఇలా రాసుకొచ్చాడు.
‘ఇద్దరు లెజెండరీ సింగర్స్ తో ఎంజాయ్ చేస్తున్నా.. అంతేగకా లెజెండ్స్ కే లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో కూడా...’ అని ట్వీట్ చేశాడు. వీడియోలో సచిన్ కూడా యువీ డాన్స్ చేస్తుండగా తన ఫోన్ తీసి రికార్డు చేస్తూ ఉల్లాసంగా కనిపించాడు.
సెప్టెంబర్ 10 న ప్రారంభమైన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2 లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇండియా లెజెండ్స్ విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్.. సౌతాఫ్రికా లెజెండ్స్ పై విజయం సాధించింది. తొలుత భారత బ్యాటర్లు చెలరేగి జట్టుకి 217 భారీ స్కోరు అందించగా ఆ తర్వాత బౌలర్లు అదరగొట్టి ప్రత్యర్థిని 156 పరుగులకే పరిమితం చేశారు. ఫలితంగా తొలి మ్యాచ్లో 61 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టెండూల్కర్ సారథ్యం వహిస్తున్న ఇండియా లెజెండ్స్ టీమ్. ఈ మ్యాచ్ లో స్టువర్ట్ బిన్నీ 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.