Irani Cup: భారత జాతీయ జట్టులోకి దూసుకొచ్చేందుకు  మరో యువ కెరటం సిద్ధమవుతోంది.  దేశవాళీలో  పరుగుల వరద పారిస్తున్న  ఈ ముంబై కుర్రాడు.. ఇరానీ కప్ లో ఇరగదీశాడు.

దేశవాళీ క్రికెట్ లో ముంబై బ్యాటర్ (పుట్టింది ఉత్తరప్రదేశ్‌లో) యశస్వి జైస్వాల్ దుమ్మురేపుతున్నాడు. ఆడుతున్నది తొలి ఇరానీ కప్ అయినా ఏమాత్రం బెదురులేకుండా ఒకే మ్యాచ్ లో డబుల్ సెంచరీతో పాటు సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 213 పరుగులు చేసిన యశస్వి.. రెండో ఇన్నింగ్స్ లో శతకం (144) తో మెరిశాడు. ఇరానీ కప్ లో ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. యశస్వి విజృంభణతో ఇరానీ కప్ లో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మార్చి 1 నుంచి గ్వాలియర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రోజే డబుల్ సెంచరీ చేసిన యశస్వి.. నాలుగో రోజు సెంచరీతో కదం తొక్కాడు. 157 బంతుల్లోనే 16 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేసి మరో భారీ ఇన్నింగ్స్ ఆడాడు.

యశస్వి రెచ్చిపోవడంతో రెండో ఇన్నింగ్స్ లో రెస్టాఫ్ ఇండియా.. 246 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 484 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 294 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో రెస్టాఫ్ ఇండియాకు 190 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టు 246 పరుగులు చేయడంతో మధ్యప్రదేశ్ ఎదుట 437 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.

లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్ రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ అర్హమ్ వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు సారథి హిమాన్షు మంత్రి (26 నాటౌట్), శుభమ్ శర్మ (9 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఆ జట్టు రేపంతా బ్యాటింగ్ చేయాలి.

యశస్వి సూపర్ ఫామ్.. 

దేశవాళీ క్రికెట్ లో ఇదివరకే సర్ఫ్‌రాజ్ ఖాన్ మెరుపులు మెరిపిస్తుండగా తాజాగా సెలక్టర్లకు మరో తలనొప్పి యశస్వి రూపంలో ఎదురుకానుంది. ఆడిన 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో యశస్వి.. 26 ఇన్నింగ్స్ లలో 80.21 సగటుతో 1,845 రన్స్ చేశాడు. ఇందులో 9 సెంచరీలు మూడు డబుల్ సెంచరీలు ఉండటం గమనార్హం. రంజీ సెమీస్, క్వార్టర్స్ లో సెంచరీలతో పాటు దులీప్, ఇరానీ కప్ ఫైనల్స్ లో సెంచరీ చేసిన ఘనత జైస్వాల్ పేరిట ఉంది. దేశవాళీలో తన సహచర ఆటగాడు సర్ఫ్‌రాజ్ మాదిరిగానే రెచ్చిపోతున్న ఈ యువ క్రికెటర్ కు సెలక్టర్లు ఎప్పుడు అవకాశమిస్తారో మరి..? 

Scroll to load tweet…

కాగా ఇరానీ కప్ ఫైనల్స్ లో ఒకే మ్యాచ్ లో 213, 144 (357) పరుగులు చేయడం ద్వారా యశస్వి అరుదైన రికార్డును అందుకున్నాడు. ఫైనల్ లో 300 ప్లస్ స్కోరు చేసిన రెండో బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. 

Scroll to load tweet…