WTC Final 2023: ఇటీవలే ఐపీఎల్ లో గాయపడ్డ టీమిండియా వెటరన్ బ్యాటర్  కెఎల్ రాహుల్ స్థానంలో రిప్లేస్‌మెంట్  ను బీసీసీఐ ప్రకటించింది. 

ఐపీఎల్-16లో భాగంగా మే 1న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో మ్యాచ్ లో గాయపడ్డ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెఎల్ రాహుల్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌.. రాహుల్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఈ మేరకు సోమవారం బీసీసీఐ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

వచ్చే నెల 7 నుంచి 11 మధ్య ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత జట్టు ఇదివరకే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. 

వికెట్ కీపర్లుగా కెఎల్ రాహుల్, కోన శ్రీకర్ భరత్ లను ప్రకటించిన బీసీసీఐ.. రాహుల్ గాయంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్ తో పాటు హార్ధిక్ పాండ్యా పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇషాన్ కిషన్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఐపీఎల్ -16లో ఇరగదీస్తున్న సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు ఢిల్లీ బౌలర్ ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ లు స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు.

ఇషాన్ ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. గతేడాది బంగ్లాదేశ్ తో డబుల్ సెంచరీ తర్వాత రంజీలలో కూడా రాణించి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కూడా అంత గొప్ప ప్రదర్శన ఏమీ చేయలేదు. ఆడిన 10 మ్యాచ్ లకు గాను 10 ఇన్నింగ్స్ లలో 29.3 సగటుతో 293 పరుగులే చేశాడు. మరి ఇషాన్ కు తుది జట్టులో చోటు దక్కుతుందా..? లేక భరత్ తోనే కొనసాగిస్తారా..? అన్నది త్వరలో తేలనుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సవరించిన భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)

స్టాండ్ బై ప్లేయర్లు : రుతురాజ్ గైక్వాడ్, ముకేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ 

Scroll to load tweet…

కాగా కెఎల్ రాహుల్ తో పాటే గాయపడ్డ మరో బౌలర్ జయదేవ్ ఉనద్కత్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ ఉమేశ్ యాదవ్ లు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. అయితే ఎన్ని విమర్శలు వస్తున్నా సెలక్టర్లు ఇప్పటికీ దేశవాళీలో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ను మరోసారి పక్కనబెట్టడం విమర్శలకు తావిస్తున్నది.