WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా 400 మార్కు దాటి మెరుగైన స్థితికి వచ్చింది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఫస్ట్ సెషనల్ నాలుగు వికెట్లు కోల్పోయినా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇప్పటికే ఆ జట్టు 400 మార్కు దాటింది. రెండో రోజు లంచ్ సమయానికి ఆసీస్.. 109 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. ప్రస్తుతం వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (43 బంతుల్లో 22 నాటౌట్, 3 ఫోర్లు), కెప్టెన్ పాట్ కమిన్స్ (17 బంతుల్లో 2 నాటౌట్) ఆడుతున్నారు.
తొలి రోజు 3 వికెట్లు త్వరగానే తీసిన భారత బౌలర్లు తర్వాత తేలిపోయారు. ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) ల ధాటికి చేతులెత్తేశారు. ఈ ఇద్దరూ మొదటిరోజే ఆసీస్ భారీ స్కోరుకు బాటలు పరిచారు.
327-3 ఓవర్ నైట్ స్కోరు వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్.. అదే జోరును కొనసాగించింది. సిరాజ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే రెండు బౌండరీలు బాదిన స్మిత్ తన టెస్టు కెరీర్ లో 31 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే క్రమంలో నిన్న 144 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను ముగించిన ట్రావిస్ హెడ్ కూడా షమీ బౌలింగ్ లో ఫోర్ కొట్టి 150 పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. సిరాజ్ వేసిన 92వ ఓవర్లో హెడ్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో స్మిత్ తో కలిసి హెడ్ నెలకొల్పిన 285 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
హెడ్ స్థానంలో వచ్చిన కామెరూన్ గ్రీన్.. 7 బంతుల్లో ఆరు పరుగులే చేసి షమీ వేసిన 95వ ఓవర్లో రెండో బాల్ కు స్లిప్స్ లో శుభ్మన్ గిల్ చేతికి చిక్కాడు. ఇక గ్రీన్ నిష్క్రమించిన తర్వాత శార్దూల్ ఠాకూర్ వేసిన 99వ ఓవర్లో మొదటి బంతికే స్మిత్ కూడా బాల్ ను వికెట్ల మీదుగా ఆడుకుని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 268 బంతులు ఆడిన స్మిత్.. 19 బౌండరీల సాయంతో 121 పరుగులు చేశాడు.
ఇక స్మిత్ స్థానంలో వచ్చిన మిచెల్ స్టార్క్.. 20 బంతుల్లో ఐదు పరుగులు చేశాడు. సిరాజ్ వేసిన 104వ ఓవర్లో ఐదో బంతిక స్టార్క్ సింగిల్ తీయబోతూ రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ సూపర్ త్రో తో స్టార్క్ వెనుదిరిగాడు. స్టార్క్ నిష్క్రమించినా కమిన్స్ సాయంతో ఆసీస్ ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. రెండో సెషనల్ లో ఈ ఇద్దరినీ ఎంత త్వరగా ఔట్ చేస్తే భారత్ కు అంతమంచిది. ఇప్పటికే స్కోరు 420 దాటిన నేపథ్యంలో 450 లోపు ఆసీస్ ను ఆలౌట్ చేయకుంటే అది మొదటికే మోసం.
ఇక నిన్న విఫలమైన భారత బౌలర్లు ఇవాళ మాత్రం ఫర్వాలేదనిపించారు. షమీ, సిరాజ్, ఠాకూర్ లు తలా ఓ వికెట్ తీయగా అక్షర్ పటేల్ రనౌట్ తో ఆసీస్ ఫస్ట్ సెషనల్ లో నాలుగు వికెట్లు కోల్పోయింది.
