ముదురుతున్న వివాదం.. గుజరాత్ జెయింట్స్పై విండీస్ క్రికెటర్ సంచలన ఆరోపణలు
WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ప్లేఆఫ్స్ రేసులో కీలక మ్యాచ్ ఆడుతున్న గుజరాత్ జెయింట్స్ కు వెస్టిండీస్ ప్లేయర్ షాకిచ్చింది.
గుజరాత్ జెయిట్స్ వివాదంలో చిక్కుకుంది. ఆడేందుకు ఫిట్ గా లేదనే కారణంగా తనను అన్యాయంగా డబ్ల్యూపీఎల్ నుంచి తప్పించారని ఆరోపిస్తూ వెస్టిండీస్ ఆల్ రౌండర్ డియాండ్రా డాటిన్ గుజరాత్ పై విమర్శలు చేసింది. గత నెలలో ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలంలో డాటిన్ ను గుజరాత్ జెయింట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్ లో తొలి మ్యాచ్ కు ముందు ఆమెను టీమ్ నుంచి తప్పించడం వివాదానికి దారితీసింది.
అసలేం జరిగింది..?
ముంబైతో తొలి మ్యాచ్ కు ముందు గుజరాత్ జెయింట్స్.. ఆ జట్టు ఆల్ రౌండర్ డియాండ్రా డాటిన్ ను టీమ్ నుంచి తప్పించింది. ఇంకా ఆమె గాయం నుంచి కోలుకోలేదని.. డాటిన్ స్థానంలో కిమ్ గార్త్ (ఆస్ట్రేలియా) ను రిప్లేస్ చేసుకుంది. అయితే తనను టీమ్ నుంచి తప్పించిన మరుసటి రోజే డాటిన్ స్పందిస్తూ.. ‘నేను ఫిట్ గానే ఉన్నా. నేనేం గాయం నుంచి కోలుకోవడం లేదు. నన్ను ఎందుకు రిప్లేస్ చేశారో అర్థం కావడం లేదు..’అని వ్యాఖ్యానించింది.
డాటిన్ వ్యాఖ్యలకు గుజరాత్ జెయింట్స్ ట్విటర్ వేదికగా స్పందించింది.‘డాటిన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. మాతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె నిర్ణీత గడువుకు ముందు మెడికల్ క్లీయరెన్స్ సర్టిఫికెట్ తీసుకురాలేదు. ప్రతీ ప్లేయర్ కు మెడికల్ క్లీయరెన్స్ సర్టిఫికెట్ అవసరం అని నిబంధనల్లో కూడా ఉంది. ఆమె త్వరలోనే మళ్లీ ఫీల్డ్ లోకి వస్తుందని ఆశిస్తున్నాం. వచ్చే సీజన్లలో ఆమె మా ఫ్రాంచైజీ తరఫున భాగస్వామిగా ఉంటుంది..’అని ట్వీట్ చేసింది.
నిరాశ చెందా..
గుజరాత్ జెయింట్స్ ప్రకటనపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న డాటిన్ ఇప్పుడు సుదీర్ఘ వివరణ ఇచ్చింది. తాను గతేడాది డిసెంబర్ లో కడుపునొప్పితో బాధపడ్డ మాట వాస్తవమే కానీ దానికి చికిత్స తీసుకుని వైద్య నిపుణుల దగ్గర తాను ఫిట్ గా ఉన్నట్టు రిపోర్టులు కూడా తీసుకొచ్చానని, వాటిని గుజరాత్ ఫిజియోథెరపిస్టుకు అందజేశానని ప్రకటనలో పేర్కొంది. తాను ఫిట్ గా ఉన్నానని చెప్పినా కూడా కడుపునొప్పితో బాధపడుతున్నానని చెప్పారని, కొత్త స్కానింగ్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారని ప్రకటనలో రాసుకొచ్చింది. తనను డబ్ల్యూపీఎల్ నుంచి తొలగించడానికి దారి తీసిన ఘటనలు ఇవేనని ట్విటర్ వేదికగా తెలిపింది.