WPL 2023: ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు   ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.   తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆ జట్టుకు అదే క్రేజ్ ఏర్పడింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ కు రానుంది. 

శనివారం ముంబై వేదికగా మొదలైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ఐపీఎల్ లో అత్యంత క్రేజ్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. మహిళల లీగ్ లో కూడా ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం.. టీమ్ లో టీమిండియా క్వీన్ స్మృతి మంధాన తో వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆసీస్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ, పేస్ సంచలనం రేణుకా ఠాకూర్ లు ఉండటంతో ఉమెన్స్ లీగ్ లో కూడా ఆ జట్టుకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ జట్టు మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. 

ముంబై లోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ కు రానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదలు బ్యాటింగ్ చేయనుంది. 

ఇటీవలే ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలంలో ఆర్సీబీ.. స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆమె ఒక జట్టుకు పూర్తి స్థాయిలో సారథిగా వ్యవహరిస్తుండటం ఇదే తొలిసారి. ఆర్సీబీలో మంధానతో పాటు సోఫీ డివైన్, హీథర్ నైట్ వంటి స్టార్ బ్యాటర్లున్నారు.

శనివారం ముగిసిన ముంబై - గుజరాత్ మ్యాచ్ ప్రేక్షకులకు విశేషంగా అలరించింది. కాగా నేటి మ్యాచ్ లో కూడా ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో మరో రసవత్తర పోరు కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ జట్టులో భీకర ఓపెనర్ షఫాలీ వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్ వంటి స్టార్ ప్లేయర్లున్నారు. ఆస్ట్రేలియాకు ఐదు ఐసీసీ ప్రపంచకప్ లు అందించిన మెగ్ లానింగ్.. ఆ జట్టుకు సారథిగా ఉంది. ఆమె బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించేదే. దీంతో ఇరు జట్ల అభిమానులకు భారీ స్కోర్ల పండగే ఉండనుంది.