WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)  తొలి సీజన్ కు ఘనమైన ఆరంభాన్నిస్తూ  ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే  ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్ పై భారీ స్కోరు చేసింది.   

మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ లో రోహిత్ సేనకు ఏమాత్రం తీసిపోకుండా దుమ్ముదులిపింది. గుజరాత్ జెయింట్స్ తో డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65, 14 ఫోర్లు) తో పాటు ఓపెనర్ హీలి మాథ్యూస్ (31 బంతుల్లో 47, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమిలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్స్) లు రెచ్చిపోవడంతో గుజరాత్ ముందు భారీ లక్ష్యం నిలిపారు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై.. మూడో ఓవర్లోనే ఓపెనర్ యస్తికా భాటియా (1) వికెట్ ను కోల్పోయింది. కానీ నటాలి సీవర్ (18 బంతుల్లో 23, 5 ఫోర్లు) లో కలిసి మాథ్యూస్ రెచ్చిపోయింది. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 54 పరుగులు జోడించారు. ఇద్దరూ గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. 

ముఖ్యంగా మాథ్యూస్ సదర్లాండ్ వేసిన 8వ ఓవర్ లో రెండు సిక్సర్లు బాదింది. ఆ తర్వాత వెర్హమ్ బౌలింగ్ లో కూడా సిక్స్ కొట్టింది. అదే ఓవర్లో సీవర్ నిష్క్రమించింది. కొద్దిసేపటికే మాథ్యూస్ ను గార్డ్‌నర్ క్లీన్ బౌల్డ్ చేసింది.

77 కే 3 వికెట్లు కోల్పోయిన ముంబైని హర్మన్‌ప్రీత్ ఆదుకుంది. స్నేహ్ రాణా వేసిన 11వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన ఆమె.. వెర్హమ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా మూడు ఫోర్లు కొట్టింది. అనంతరం సదర్లాండ్ వేసిన 13వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు వచ్చాయి. మంధాన ఇచ్చిన స్ఫూర్తితో అమిలియా కెర్ కూడా స్నేహ్ రాణా వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టింది. ఇక మోనికా పటేల్ వేసిన 15వ ఓవర్లో కౌర్ మూడు బౌండరీలు రాబట్టింది. గార్డ్‌నర్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి బౌండరీ బాది 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్ లో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆ తర్వాత అదే ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదడంతో స్కోరుబోర్డు రాకెట్ వేగాన్ని తలపించింది.

Scroll to load tweet…

హాఫ్ సెంచరీ తర్వాత కౌర్.. స్నేహ్ రాణా వేసిన 17వ ఓవర్ చివరిబంతికి హేమలతకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కౌర్ ఔటైనా ఆమె స్థానంలో వచ్చిన పూజా వస్త్రకార్ (8 బంతుల్లో 15, 3 ఫోర్లు) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. సదర్లాండ్ వేసిన 18వ ఓవర్లో కెర్ రెండు ఫోర్లు కొట్టింది. గార్డ్‌నర్ వేసిన 19వ ఓవర్లో వస్త్రకార్.. మూడు బౌండరీలు కొట్టింది. స్నేహ్ రాణా వేసిన చివరి ఓవర్లో కెర్.. భారీ సిక్సర్ బాదడంతో ముంబై స్కోరు 200 పరుగులు దాటింది.