మరి నన్ను పెళ్లి చేసుకుంటావా..? పురుష అభిమానికి ప్రపోజ్ చేసిన టీమిండియా కెప్టెన్..! వీడియో వైరల్
INDvsAUS: టీమిండియా సారథి రోహిత్ శర్మ శనివారం విశాఖపట్నం చేరుకున్న విషయం విదితమే. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భాగంగా అతడు పాల్గొన్నాడు.
భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడేందుకు విశాఖపట్నం వచ్చాడు. నేడు ఆసీస్ తో జరిగిన రెండో వన్డేలో రోహిత్.. 13 పరుగులే చేసి నిరాశపరిచాడు. తొలి వన్డేకు మిస్ అయిన హిట్మ్యాన్ రెండో వన్డేకు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఈ వన్డేకు విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఓ అభిమానితో ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా..?’అని అడిగాడు. సదరు అభిమాని పురుషుడే కావడం గమనార్హం.
శనివారం విశాఖకు వచ్చిన రోహిత్ తో ఫోటో దిగడానికి ఎయిర్ పోర్టులో ఓ అభిమాని సెల్ఫీ వీడియో ప్రారంభించాడు. అటుగా వస్తున్న రోహిత్ ను చూపిస్తూ ఏదో అనబోయాడు.
అప్పుడే అతడి దగ్గరికి వచ్చిన రోహిత్ .. అతడికి తన చేతిలో ఉన్న ఎర్ర గులాబీని ఇచ్చి ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా..?’అని ఫన్నీగా అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. మ్యాచ్ లు ఆడేప్పుడు కామ్ గా ఉంటూ పనికానిచ్చే రోహిత్ లో ఇంత హ్యూమర్ ఉందా...? అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు రోహిత్ భార్య రితేశ్ సర్దేశాయ్ ఫోటోను షేర్ చేస్తూ హిట్మ్యాన్ ను ట్రోల్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా విశాఖపట్నం వేదికగా ముగిసన రెండో వన్డేలో భారత్ పేలవ ప్రదర్శనతో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యచ్ లో భారత్.. 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్.. ఐదు వికెట్లతో చెలరేగాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్యాన్ని ఆసీస్.. 11 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్ (66 నాటౌట్), ట్రావిస్ హెడ్ (51 నాటౌట్) వీరవిహారం చేసి ఆసీస్ కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఆసీస్.. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 1-1 తో సమం చేసింది. మూడో వన్డే ఈనెల 22న చెన్నై వేదికగా జరుగనుంది.