కెఎల్ రాహుల్పై మామ సునీల్ శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
INDvsAUS:టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్.. ఇటీవలే బాలీవుడ్ వెటరన్ యాకర్ట్ సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని వివాహమాడిన విషయం తెలిసిందే.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా మూడు రోజుల క్రితం ముగిసిన తొలి వన్డేలో భారత్ ను గెలిపించిన కెఎల్ రాహుల్.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. 39కే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన దశలో హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో కలిసి రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 91 బంతులాడిన రాహుల్.. 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
లో స్కోరింగ్ గేమ్ లో అతడు నిలబడి భారత్ ను గెలిపించిన తర్వాత నిన్నా మొన్నటి దాకా రాహుల్ పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా అతడిని ప్రశంసల్లో ముంచెత్తాడు.
కాగా రాహుల్ ప్రదర్శనపై తాజాగా అతడి మామ.. సునీల్ శెట్టి స్పందించాడు. ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బాలీవుడ్ నటుడిని అక్కడున్న విలేకరులు రాహుల్ ఇన్నింగ్స్ గురించి అడిగారు. దీనికి సునీల్ శెట్టి స్పందిస్తూ.. ‘ఆ దేవుడు మీతో ఉన్నంతకాలం బయటివాళ్లు ఏం మాట్లాడుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ’ అని తెలిపాడు. ఈ వ్యాఖ్యల ద్వారా సునీల్ శెట్టి అటు ట్రోలర్స్ తో పాటు వెంకటేశ్ ప్రసాద్ కు కూడా కౌంటర్ ఇచ్చాడు.
కాగా వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 188 పరుగులకు ఆలౌట్ కాగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ 40 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. 16 పరుగులకే 3, 39 రన్స్ కు నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్.. హార్ధిక్ పాండ్యా (25), రవీంద్ర జడేజా (45 నాటౌట్ ) లతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను గెలిపించాడు.
అయితే రెండో వన్డేలో మాత్రం రాహుల్ మ్యాజిక్ పనిచేయలేదు. ఈ మ్యాచ్ లో రాహుల్.. 9 పరుగులే చేసి నిష్క్రమించాడు. విశాఖ వేదికగా ముగిసిన ఈ మ్యచ్ లో భారత్.. 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్.. ఐదు వికెట్లతో చెలరేగాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్యాన్ని ఆసీస్.. 11 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్ (66 నాటౌట్), ట్రావిస్ హెడ్ (51 నాటౌట్) వీరవిహారం చేసి ఆసీస్ కు విజయాన్ని అందించారు.