Sadhguru Save Soil Movement: నేల తల్లిని సంరక్షించాలనే సదుద్దేశంతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు 30 వేల కిలోమీటర్ల మోటార్ సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆయన విండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ తో పాటు...
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు నడిపిస్తున్న ‘నేల పరిరక్షణ’ (Save Soil Movement) ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. నేల తల్లిని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమానికి ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ తో పాటు ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్ ఇయాన్ బోథమ్ లు కూడా మద్దతు పలికారు. ఈ ఉద్యమం ఎంతో గొప్పదని వాళ్లు కొనియాడారు. వెస్టిండీస్-ఇంగ్లాండ్ మధ్య అంటిగ్వా వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఈ అపూర్వ కలయికకు వేదికైంది.
విండీస్-ఇంగ్లాండ్ తొలి టెస్టు నేపథ్యంలో అంటిగ్వా వెళ్లిన సద్గురు.. అక్కడే ఉన్న వివ్ రిచర్డ్స్, ఇయాన్ బోథమ్ లను కలిశారు. వాళ్లతో ‘సేవ్ సాయిల్ మూవ్మెంట్’ గురించి వివరించారు. ఈ సందర్బంగా వారి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
రిచర్డ్స్ తో సద్గురు మాట్లాడుతూ... ‘మీరు నా ఆల్ టైం ఫేవరేట్ క్రికెటర్. మీకో విషయం తెలుసా.. మిమ్మల్ని మేము ఒక్క విషయంలో ద్వేషిస్తాం. అదేంటంటే మీరు మా ప్రత్యర్థి జట్టులో ఉన్నారు. అంతకుమించి మేము మిమ్మల్ని ఎంతో ఇష్టపడతాం. భారత్ లో ప్రజలు మిమ్మల్ని వెస్టిండీస్ క్రికెటర్ గా చూడరు. అది చాలా గొప్ప విషయం...’ అని అన్నారు. అనంతరం తన సేవ్ సాయిల్ మూవ్మెంట్ గురించి సద్గురు రిచర్డ్స్ కు వివరించారు. కాగా రిచర్డ్స్ మాట్టాడుతూ... ‘మనం భూమిని కాపాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన సందేశం. మీరు దీనిలో పాలుపంచుకోవాలి. నేను వంద శాతం మీకు మద్దతిస్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం మీకు ఇంతకంటే మెరుగైన సందేశం ఉండకపోవచ్చు.. ’ అని తెలిపారు.
కాగా రిచర్డ్స్ తో పాటు లెజెండరీ ఆటగాడు బోథమ్ తో కూడా సద్గురు ముచ్చటించారు. ఆయనతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘సర్ వివ్ రిచర్డ్స్, లార్డ్ ఇయాన్ బోథమ్.. అంటిగ్వాలో మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఎంచుకున్న రంగాలతో పాటు బయట కూడా మీరు సాధించిన విజయాలు అభినందనీయం. భూమిపై ఉన్న సమస్త జీవరాశికి ఆధారమైన నేలను పునరుద్ధరించడంలో దయచేసి నాతో చేరండి..’ అని సద్గురు రాసుకొచ్చారు.
అంతకుముందు అంటిగ్వా చేరుకున్న సద్గురుకు బార్బుడా ప్రధానమంత్రరి గాస్టన్ బ్రౌన్ ఘనంగా స్వాగతం పలికారు. నేల క్షీణత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు గాను ఉద్దేశించిన ఒప్పందంలో ఇరువురు సంతకాలు చేశారు. సేవ్ సాయిల్ ఉద్యమంలో భాగంగా సద్గురు ప్రపంచ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. వంద రోజుల్లో 30 వేల కిలోమీటర్ల (27 దేశాలలో) మోటార్ సైకిల్ యాత్ర మార్చి 21తో ముగియనుంది.
