సారాంశం

Yash Dhull Set Target For Himself: ఇటీవలే ముగిసిన అండర్-19 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ ను మట్టికరిపించిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన  యశ్ ధుల్ తన టార్గెట్ సెట్ చేసుకున్నాడు. 

టీమిండియా కు ఐదో అండర్-19 ప్రపంచకప్ అందించిన యశ్ ధుల్.. తన భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ధుల్ రూపంలో భారత జట్టుకు  మరో విరాట్ కోహ్లి దొరికాడని భావిస్తున్న నేపథ్యంలో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే 18 నెలల్లో తాను టీమిండియా సీనియర్ జట్టులో ఉంటానని ధీమా  వ్యక్తం చేశాడు. ఆ మేరకు  తాను టార్గెట్ పెట్టుకున్నానని, ఏడాదిన్నరలో తనను  సీనియర్ జట్టులో చూస్తారని అన్నాడు. అండర్ - 19 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న యశ్ ధుల్ సేనను బుధవారం బీసీసీఐ సత్కరించింది.  అనంతరం  ఓ జాతీయ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ధుల్ మాట్లాడుతూ... ‘18 నెలల్లో టీమిండియా సీనియర్ జట్టుకు ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్నాను. ఆ మేరకు నేను నావంతుగా కృషి చేస్తాను. ఒకవేళ  ఆ టైమ్ లోపు నా లక్ష్యాన్ని చేరుకోకుంటే నేను మరింత ఎక్కువగా శ్రమిస్తాను. ఏదేమైనా నా లక్ష్యాన్ని చేరుకోవడమే నాకు ముఖ్యం..’ అని అన్నాడు. 

ఢిల్లీ కుర్రాడైన ధుల్.. భారత్ కు  విరాట్ కోహ్లి,  ఉన్ముక్త్ చంద్ తర్వాత అండర్-19 ప్రపంచకప్ అందించిన  మూడో క్రికెటర్. విరాటట్, చంద్ ది కూడా ఢిల్లీనే కావడం విశేషం. తనను కోహ్లి, చంద్ తో పోల్చడంపై కూడా ధుల్  స్పందించాడు. ‘నేను వాళ్లను ఆరాధిస్తాను. కోహ్లి నుంచి స్ఫూర్తి పొందుతాను. అండర్-19 ప్రపంచకప్ నకు ముందు రోజు మేము విరాట్  భాయ్ తో మాట్లాడాం.  అప్పుడు  విరాట్ అన్న నాకు 2008 ప్రపంచకప్ విషయాలను చెప్పారు.  అతడితో మాట్లాడాక నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది.. ఏ విషయాలను పట్టించుకోవాలి..? దేనిని వదిలేయాలి..?  అని తెలుసుకున్నాను.. ’ అని అన్నాడు. 

 

ప్రపంచకప్ నెగ్గాక  ధుల్ కు ఊహించని  క్రేజ్ వచ్చింది. ఈసారి వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం కూడా ఉంది. కోహ్లి మాదిరే బ్యాటింగ్ శైలి కలిగి ఉన్న యశ్ ధుల్ కు సారథ్య లక్షణాలు కూడా ఉండటం  అతడికి కలిసొచ్చేదే. అయితే టీమిండియాలోకి రాకముందు కోహ్లి  దేశవాళీ కూడా ఆడాడు.  రంజీలలో నిరూపించుకున్నాడు.  కానీ ధుల్ కు ఆ అవకాశం లేదు.   గత రెండేండ్లుగా కరోనా కారణంగా దేశంలో రంజీల నిర్వహణకు ఆస్కారం లేకుండా పోయింది.  ఈ ఏడాది జనవరిలో జరగాల్సిన రంజీ  సీజన్ కూడా వాయిదా పడింది. కానీ  త్వరలోనే  దానిని మళ్లీ  నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నది. ఇక   ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో.. ఢిల్లీ  రంజీ జట్టులో ధుల్ కు అవకాశం దక్కింది.  వచ్చే వారం ప్రారంభం కాబోయే సీజన్ లో అతడు ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. 

రంజీలు ఆడటంపై ధుల్ స్పందిస్తూ.. ‘ఇది నాకు పూర్తిగా కొత్త. ఇన్నాళ్లు వైట్ బాల్ (వన్డేలు) ఆడిన నేను ఇప్పుడు రెడ్ బాల్ (టెస్టులు) మీద దృష్టి పెట్టాలి. అందుకు తగ్గట్టుగా  నా మైండ్ సెట్ ను మార్చుకోవాలి. గేమ్ కు తగ్గట్టుగా నేను  ఫిట్ గా ఉండాలి. ఆటగాడిగా నన్ను నేను మార్చుకోవడానికి రంజీలు ఎంతో దోహదం చేస్తాయి..’ అని ధుల్ తెలిపాడు.