ఇంగ్లాండ్ క్రికెటర్లకు కరోనా... ముగ్గురు క్రికెటర్లతో పాటు ఏడుగురికి పాజిటివ్...
ముగ్గురు క్రికెటర్లతో పాటు ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు...
పూర్తిగా కొత్త జట్టుతో బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో పాక్ సిరీస్ ఆడనున్న ఇంగ్లాండ్ జట్టు...
కరోనా మహమ్మారి క్రికెట్ ప్రపంచాన్ని వదిలిపెట్టడం లేదు. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ ఇంగ్లాండ్ జట్టు, ప్రస్తుతం పాకిస్తాన్తో వన్డే, టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. జూలై 8 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్కి ముందు ఇంగ్లాండ్ జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకింది.
ముగ్గురు క్రికెటర్లతో పాటు నలుగురు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఇంగ్లాండ్ జట్టులో కలకలం రేగింది. దీంతో పాకిస్తాన్తో సిరీస్కి ఎంపికైన జట్టును కాకుండా పూర్తిగా కొత్త జట్టును ఎంపిక చేసి, బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఈ సిరీస్ ఆడించాలని నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ జట్టు.
ఇప్పటికే ఇంగ్లాండ్లో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయి, వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు మాస్కులు లేకుండా తిరిగేందుకు కూడా అనుమతులు జారీ చేసింది ప్రభుత్వం.
అదీకాకుండా శ్రీలంకతో జరిగిన మ్యాచులకు స్టేడియాలకు ప్రేక్షకులను కూడా అనుమతించారు. పాక్తో సిరీస్కి కూడా ప్రేక్షకులను అనుమించబోతున్నారు, ఇలాంటి సమయంలో జట్టులో మళ్లీ కరోనా కేసులు నమోదుకావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.