India Women vs Sri Lanka Women: మూడో వన్డేలో 39 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న టీమిండియా...
టీ20ల్లో లంకను వైట్ వాష్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న భారత మహిళా జట్టు, వన్డేల్లో ఆ ఫీట్ సాధించింది. తొలి రెండు వన్డేల్లో లంక విధించిన లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి గెలిచిన టీమిండియా, మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసి ఘన విజయం అందుకుంది...
పెల్లెకెలేలో జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 50 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేయగా స్మృతి మంధాన 20 బంతులాడి కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుటైంది...
వికెట్ కీపర్ యషికా భాటియా 38 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేయగా హర్లీన్ డియోల్ 1 పరుగు, దీప్తి శర్మ 4 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. రిచా ఘోష్ కూడా 2 పరుగులు చేసి పెవిలియన్ చేరడతో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది టీమిండియా...
ఈ దశలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, పూజా వస్త్రాకర్ కలిసి ఏడో వికెట్కి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టును ఆదుకున్నారు. 88 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసిన హర్మన్ప్రీత్ కౌర్, ఆటపట్టు బౌలింగ్లో అవుటైంది. పూజా వస్త్రాకర్ 65 బంతుల్లో 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది...
మేఘనా సింగ్ 8, రేణుకా సింగ్ 2, రాజేశ్వరి గైక్వాడ్ 3 పరుగులు చేశారు. 256 పరుగుల లక్ష్యఛేదనలో విస్మి గుణరత్నే వికెట్ త్వరగా కోల్పోయింది శ్రీలంక. 10 బంతుల్లో 3 పరుగులు చేసిన విస్మిని మేఘనా సింగ్ అవుట్ చేసినా రెండో వికెట్కి చమరి ఆటపట్టు, హసిని పెరేరా కలిసి 56 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
41 బంతుల్లో 8 ఫోర్లతో 44 పరుగులు చేసిన ఛమరి ఆటపట్టుని హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ చేయగా 57 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసిన హసిని పెరేరా, రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. కనిశా దిల్హరీ 12, హర్షిత మాధవి 22 పరుగులు చేయగా అనుష్క సంజీవణి 1, అమ కంచన 2, ఒసాడి రణసింగే 1, రష్మీ డి సిల్వ 18 పరుగులు, ఇనొక రణవీర 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
ఒకానొక దశలో 31.3 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసిన శ్రీలంక మహిళా జట్టు, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో 216 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో కుదురుకుపోయిన నిలాక్షి డి సిల్వ 59 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 48 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది...
భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు తీయగా మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్ రెండేసి వికెట్లు తీశారు. దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్ తలా ఓ వికెట్ తీశారు. ఈ సిరీస్లో ఆల్రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’, ఫైనల్ మ్యాచ్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు దక్కించుకుంది.
