WTC Final: రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటం, బుమ్రాకు బ్యాక్ సర్జరీ, శ్రేయాస్ అయ్యర్ కు కూడా వెన్ను గాయంతో త్వరలోనే సర్జరీకి వెళ్లనున్న నేపథ్యంలో మరిన్ని గాయాలను భరించే స్థితిలో భారత జట్టు లేదు.
రాబోయే రోజుల్లో కీలక టోర్నీలు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. తన మాజీ సహచర ఆటగాడు, ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) కి హెడ్ గా ఉన్న వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్ తో కీలక భేటీ కానున్నాడు. లక్ష్మణ్ తో పాటు ఎన్సీఎ నుంచి స్పోర్ట్స్ సైన్స్ హెడ్ నితీన్ పటేల్ తో కూడా సమావేశం కానున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ లో భారత జట్టు ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడాల్సి ఉంది. అంతేగాక ఇదే ఏడాది అక్టోబర్ లోనే భారత్ వేదికగానే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కూడా జరగాల్సి ఉంది. పదేండ్లుగా ఐసీసీ ట్రోఫీ సాధించడంలో విఫలమవుతున్న భారత జట్టు ఈ రెండింటిని చాలా సీరియస్ గా తీసుకుంది.
వన్డే వరల్డ్ కప్ కోసం ఇదివరకే 20 మందితో కూడిన టీమ్ ను రెడీ చేసుకున్న భారత జట్టుకు గాయాలు కొత్త తలనొప్పులను తీసుకొస్తున్నాయి. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటం, బుమ్రాకు బ్యాక్ సర్జరీ, శ్రేయాస్ అయ్యర్ కు కూడా వెన్ను గాయంతో త్వరలోనే సర్జరీకి వెళ్లనున్న నేపథ్యంలో మరిన్ని గాయాలను భరించే స్థితిలో భారత జట్టు లేదు.
అయితే భారత జట్టుకు ప్రస్తుతం పొంచి ఉన్న గండం ఐపీఎల్. ఈ లీగ్ లో ఇదివరకే పలువురు ప్లేయర్లు గాయాల బారీన పడ్డారు. కేన్ విలియమ్సన్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రీస్ టాప్లీ, దీపక్ చాహర్ లు గాయాలపాలయ్యారు. చాహర్ కు గతేడాది వేధించిన తొడ కండరాల గాయం మళ్లీ తిరగబెట్టింది. ఈ సీజన్ ముగియడానికి ఇంకా నెలన్నర టైమ్ మిగిలుంది. ఆలోపు మరెంత మంది ప్లేయర్లు గాయాల పాలవుతారోనని అభిమానులతో పాటు బీసీసీఐ కూడా ఆందోళనగా ఉంది.
భారత ఆటగాళ్ల విషయంలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చూసుకోవాలని స్వయంగా టీమిండియా సారథి రోహిత్ శర్మతో పాటు బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు విజ్ఞప్తి చేసినా ఇంతవరకైతే అవి దానిని పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. ఐపీఎల్ లో భారత ఆటగాళ్ల వర్క్ లోడ్ ను ఎన్సీఏ పర్యవేక్షిస్తున్న తరుణంలో ద్రావిడ్ - లక్ష్మణ్ ల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటగాళ్లు పదే పదే గాయాల బారిన పడుతుండటం.. రీహాబిటేషన్ కోసం ఎన్సీఎకు వస్తున్నా వారిలో చాలా మంది తిరిగి గాయాలతో తిరిగొస్తుండటం ద్రావిడ్ అండ్ టీమ్ కు చికాకు తెప్పిస్తున్నది. దీంతో ఇదే విషయమై లక్ష్మణ్, నితీన్ పటేల్ తో చర్చించేందుకు రాహుల్ ద్రావిడ్, టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, ఇతర సపోర్ట్ స్టాఫ్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారని తెలుస్తున్నది. సమావేశం తేదీ, ఇతర వివరాలు తెలియరాకున్నా త్వరలోనే ఈ భేటీ జరిగే అవకాశముందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
