Rohit Sharma: ప్రేక్షకులకంటే తప్పకపాయే.. కెప్టెన్కూ అవే తిప్పలా..? హెచ్సీఏ తీరుపై రోహిత్ శర్మ అసంతృప్తి
IND vs AUS T20I: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఉప్పల్ వేదికగా ముగిసిన మూడో టీ20 లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ మ్యాచ్ కు ముందు, తర్వాత హెచ్సీఏ వ్యవహరించిన తీరు విమర్శలపాలవుతున్నది.
రెండ్రోజుల క్రితం హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ముగిసిన ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ చూడటానికి ఉప్పల్ కు చేరుకున్న ప్రేక్షకులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సాక్షాత్తు భారత సారథి రోహిత్ శర్మకు సరైన కుర్చీ వేయలేకపోయింది. మ్యాచ్ ముగిశాక మీడియా సమావేశానికి వచ్చిన హిట్ మ్యాన్ కు వేసిన కుర్చీలో కూర్చోడానికి అతడు ఇబ్బంది పడ్డాడు. హెచ్సీఏ తీరుముందే రోహిత్.. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
మ్యాచ్ నిర్వహణలో భాగంగా జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ల విషయంలో హెచ్సీఏ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేకపోవడంతో టికెట్ల కోసం వేల సంఖ్యలో వచ్చిన ఔత్సాహికులపై పోలీసులు లాఠీ చార్జికి దిగారు. కాంప్లిమెంటరీ టికెట్లు పలువురు రాజకీయ పార్టీలకు చెందిన చోటా మోటా నాయకులకూ హెచ్సీఏ ఇచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక మ్యాచ్ కు టికెట్లు దొరికాయని పలువురు అభిమానులు ట్విటర్ లో ఫోటోలు పెట్టగా కొందరు ఉప్పల్ స్టేడియంలో కుర్చీలు ఎలా ఉన్నాయనే విషయమై సోషల్ మీడియాలో చేసిన ఫోటోలు కూడా వైరలయ్యాయి. కుర్చీల మీద పక్షులు మల విసర్జన, విరిగిపోయి, పాడైపోయి ఉన్న చైర్స్ ఫోటోలు వైరలయ్యాయి. అయితే మ్యాచ్ సమయానికల్లా ‘మమ’ అనిపించి చేతులు దులుపుకున్న హెచ్సీఏ.. రోహిత్ మీడియా సమావేశంలో మాత్రం దొరికిపోయింది.
దక్కన్ క్రానికల్ లో వచ్చిన కథనం మేరకు.. మ్యాచ్ ముగిశాక విలేకరులతో మాట్లాడటానికి వచ్చిన రోహిత్ అక్కడున్న కుర్చీని చూసి కంగుతిన్నాడు. రోహిత్ కు వేసిన చైర్.. ముందు టేబుల్ మీద ఉన్న మైకుల కంటే తక్కువ ఎత్తులో ఉంది. అది అంత సౌకర్యంగా లేకపోవడంతో హెచ్సీఏ ప్రతినిధులు మళ్లీ మరో చైర్ తెప్పించారు. అది కూడా అంతే ఉండటంతో రోహిత్ చిరాకుగా ‘క్యా యార్’ అని చిరాకుపడ్డాడు.
రోహిత్ ప్రెస్ కాన్ఫెరెన్స్ ఘటనతో హెచ్సీఏ మరోసారి విమర్శలపాలైంది. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులను పట్టించుకోకున్నా పాయే గానీ సారథిని కూడా ఇలాగే గౌరవిస్తారా..? అని క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.